దమ్మపేట: సెప్టెంబరు 2న నిర్వహించ తలపెట్టిన టీఆర్ఎస్ జెండాపండుగలో భాగంగా మండలంలో వాడవాడలా టీఆర్ఎస్ జెండా రెపరెపలాడాలని జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టే జెండా పండుగను ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పండుగలా నిర్వహించాలని, సెప్టెంబరు 2న ప్రతి ఇంటిపై టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని అన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం నాటి ఉద్యమనేత కేసీఆర్ ఎత్తిన గులాబీ జెండా కోట్లమందిని కదిలించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిపెట్టిందన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుటా టీఆర్ఎస్ జెండా అని అభివర్ణించారు. సెప్టెంబర్ 2న దేశ రాజధాని ఢిల్లీలో సీఎం కేసీఆర్ చేతులమీదుగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుందని, ఈ నేపథ్యంలో ఢిల్లీలో జయపతాక ఎగరవేయబోతుందన్నారు.