హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): ‘క్విడ్ ప్రో కో’కు పాల్పడిన బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని ఎన్నికల్లో పోటీ కి అనర్హుడిగా ప్రకటించాలని ఎలక్షన్ కమిషన్ను టీఆర్ఎస్ కోరింది. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీలు శ్రీనివాస్రెడ్డి, సోమ భరత్ తదితరులు ఆదివారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ను ఎస్సార్నగర్లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఓ న్యూస్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తాను రూ.18 వేల కోట్ల ప్రాజెక్టు తీసుకొని బీజేపీలో చేరినట్టు స్వయంగా వెల్లడించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఎంపీ బడుగుల మీడియాతో మాట్లాడుతూ.. రాజగోపాల్రెడ్డి చర్యలు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమేనని మండిపడ్డారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ను రాజగోపాల్రెడ్డి గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. క్విడ్ ప్రోకో కింద మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి రాజగోపాల్రెడ్డిని మునుగోడులో పోటీ చేయకుండా డిస్క్వాలిఫై చేయాలని సీఈవోను కోరినట్టు వెల్లడించారు.
కాంట్రాక్ట్లో వచ్చిన డబ్బులతో రాజగోపాల్రెడ్డి మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గాదరి కిశోర్ మాట్లాడుతూ.. క్విడ్ ప్రో కోకు పాల్పడుతున్న రాజగోపాల్రెడ్డి లాంటివారిని ప్రోత్సహించవద్దంటూ ఈసీని కోరామని చెప్పారు. తాను తీసుకొన్న కాంట్రాక్ట్లో నుంచి ఈటల రాజేందర్, వివేక్కు కూడా వాటా ఇస్తానని చెప్పినట్టు ప్రచారం జరుగుతున్నదని పేర్కొన్నారు. రాజగోపాల్రెడ్డి మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ, అమిత్షా కాళ్ల దగ్గర తాకట్టు పెట్టాడని మండిపడ్డారు. ఇలాంటివారికి ప్రజలు చెప్పుతో కొట్టేలా తీర్పు ఇస్తారని, మునుగోడులో గులాబీ జెండానే ఎగురుతుందని చెప్పారు.