యాసంగి వడ్లు కొనకుండా కుట్రలు చేస్తున్న కేంద్రంపై రైతాంగం కన్నెర్ర చేసింది. బీజేపీ నేతల వైఖరిని నిరసిస్తూ కదం తొక్కింది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన జాతీయ రహదారుల దిగ్బంధనం విజయవంతమైంది. వందలాది మంది రైతులతో కలిసి జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడే హైవేలపై బైఠాయించారు.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని చౌటుప్పల్, నకిరేకల్, సూర్యాపేట, కోదాడల్లో, నార్కట్పల్లి -అద్దంకి రహదారిని మిర్యాలగూడ వద్ద, హైదరాబాద్-నాగార్జునసాగర్ హైవేను పెద్దవూర వద్ద, హైదరాబాద్-వరంగల్ హైవేను వంగపల్లి వద్ద దిగ్బంధించారు. రోడ్డుపై వడ్లు పోసి, వరి కంకులు చేతబట్టి నల్లజెండాలతో నిరసన తెలిపారు. ‘దేశం కోసం.. ధర్మం కోసం.. వడ్లు కొనాలె. రైతు మెడ మీద బీజేపీ కత్తి.. ఇది ఏరకంగా దేశభక్తి?” అనే నినాదాలు హోరెత్తాయి. కేంద్రానికి సెగ తగిలేలా జిల్లా నలుమూలలా హైవేలపై వాహనాల రాకపోకలు గంటలపాటు నిలిచిపోయాయి. మరోవైపు గురువారం జిల్లా కేంద్రాల్లో చేపట్టనున్న రైతు నిరసన దీక్షకు టీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. రైతులు, పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చాయి.
ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం దగా వైఖరి పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లను బేషరతుగా కొనాల్సిందేనని.. మోదీ ప్రభుత్వం వివక్షకు చరమగీతం తప్పదని హెచ్చరించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన జాతీయ రహదారుల దిగ్బంధనంలో గులాబీ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని రహదారులపై బైఠాయించారు. హైదరాబాద్-వరంగల్ హైవేపై వంగపల్లి, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్, నకిరేకల్, సూర్యాపేట, కోదాడలో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. మిర్యాలగూడ వద్ద అద్దంకి-నార్కట్పల్లి రహదారిపై, నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పెద్దవూర వద్ద కోదాడ-జడ్చర్ల రహదారిపై రైతులు ఆందోళన చేశారు.