కమలాపూర్ : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్నింటినీ అమ్మేస్తున్నారని, అమ్మకాలకే కేంద్రం ఓ శాఖను పెట్టిందని, అమ్మకానికి పెట్టిందిపేరు బీజేపీ ఐతే నమ్మకానికి పెట్టింది పేరు టీఆర్ఎస్ అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో హరీశ్రావు స్వయంగా బుల్లెట్ బండి నడుపుతూ టీఆర్ఎస్ కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. హరీశ్రావు పర్యటన సందర్భంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి కమలాపూర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ లో గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమైందని, మెజారిటీ మాత్రమే తేలాల్సి ఉందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం తప్ప తెలంగాణకు చేసిందేమీ లేదని అన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని విస్మరించి లాథూర్ కు తీసుకెళ్లిందని ఆరోపించారు.
ఈటల రాజేందరిది మొసలి కన్నీరు. తనకు అన్యాయం జరిగిందని చెబుతున్నారని కానీ ఆయన వ్యవహారం తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన చందంగా ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఈటలకు ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని పదవులు కల్పించిందన్నారు.ఈటల సొంతూరులో కేసీఆర్ 4వేల డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తే ఒక్క ఇళ్లూ నిర్మాణం జరగలేదన్నారు. హుజూరాబాద్ లో అభివృద్ధి కొనసాగాలంటే గెల్లు శ్రీనివాస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఆత్మగౌరవం గురించి మాట్లాడే ఈటల రాజేందర్ బొట్టుబిళ్లలు, కుట్టు మిషన్లు ఎందుకు పంచుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రం అంతా హుజూరాబాద్ వైపే చూస్తోందని అందుకే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ తో ఏపార్టీ పోటీ పడలేదని , విపక్షాలు కేవలం రెండోస్థానం కోసం మాత్రమే పోటీ పడుతున్నయని, తెలంగాణలో టీఆర్ఎస్తో ఏ పార్టీ పోటీ పడలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలే చల్లా ధర్మారెడ్డి, బాల్క సుమన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.