ఖలీల్వాడి: టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న ప్రతిఒక్కరితో ఈ నెల 2న పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి తెలిపారు. బుధవారం నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 2 నుంచి 12వరకు గ్రామ పంచాయతీలు, వార్డు కమిటీల ఏర్పాటు, 12 నుంచి 20వరకు మండల, పట్టణ కమిటీలు, 20 తర్వాత జిల్లా కమిటీల ఏర్పాటు, క్రియాశీల సభ్యత్వం ఉన్న వారినే పార్టీ కమిటీల్లోకి తీసుకుంటారని తెలిపారు.
అన్ని స్థాయిల్లో 51శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాతినిధ్యం ఉండాలని లేకపోతే ఏర్పాటు చేసిన కమిటీలు చెల్లవని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామ, వార్డు, డివిజన్, నగర పట్టణ కమిటీలను ప్రజలతో మమేకమైన వ్యక్తులనే ఎన్నుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా రైతులకు ఉచితంగా 24గంటల నాణ్యమైన కరెంటు, రైతుబీమా, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్ఎంబీ రాజేశ్వర్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు సూదం రవిచందర్, నుడా డైరెక్టర్లు రాజేంద్రప్రసాద్, అక్తర్ ఖాన్, సాయికుమార్, మాజీ కౌన్సిలర్ లక్కం రెడ్డి, వినియోగదారుల సమాచార కేంద్రం అధ్యక్షుడు రాజేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు