హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): ఉద్యమమే ఊపిరిగా.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు.. అస్తిత్వమే ప్రాతిపదికగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రస్తానంలో మరో కీలక మలుపు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటూ పార్టీ తీసుకొన్న నిర్ణయం దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంతో ఏర్పడ్డ పార్టీ, తన లక్ష్యాన్ని సాధించడంతోపాటు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి దేశానికి రోల్ మాడల్గా నిలిచింది. రెండు దశాబ్దాల క్రితం ఏర్పడ్డ టీఆర్ఎస్, ఇప్పుడు దేశ గతిని మార్చేందుకు బయల్దేరింది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితిగా (బీఆర్ఎస్)గా మారింది.
సమైక్యపాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కడిగా బయల్దేరారు. తెలంగాణ ఉద్యమకారులతో, మేధావులతో వేల గంటలపాటు చర్చలు జరిపారు. ఉద్యమాన్ని, రాజకీయాన్ని మేళవించి నూతన పంథాలో రాష్ట్ర సాధన కోసం పోరాటం చేయాలని నిర్ణయించారు. అక్కడి నుంచి పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ. పార్టీని 2001 ఏప్రిల్ 27వ తేదీన స్థాపించిన సంద్భంగా కరీంనగర్లో మే 17వ తేదీన ఏర్పాటు చేసిన సింహగర్జన సభ ఉమ్మడి రాష్ట్రంతోపాటు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది ‘మఖలో పుట్టి పుబ్బలో రాలిపోతుంది’ అంటూ నిట్టూర్చినవారు సైతం కరీంనగర్ సభ చూసి భయపడిపోయారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు జిల్లా పరిషత్ చైర్మన్లు, 85 జడ్పీటీసీ స్థానాలను, 3 వేల సర్పంచ్, 12 వేల వార్డులు, వందకుపైగా ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకొని సత్తాను చాటుకున్నది. 2003లో వరంగల్లో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభ దేశ చరిత్రలోనే పేరున్నది. తర్వాత 2007లో కూడా వరంగల్లో నిర్వహించిన సభ చరిత్రలో నిలిచిపోయింది.
టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనాన్ని చూసిన ఆనాటి ప్రతిపక్ష కాంగ్రెస్, టీఆర్ఎస్తో ఎన్నికల పోత్తు పెట్టుకున్నది. తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ఎన్నికల వాగ్దానం చేసింది. 2004లో టీఆర్ఎస్తో కలిసి కాంగ్రెస్ పోటీచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార పగ్గాలు చేపట్టింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ 26 శాసనసభ, 5 లోక్సభ స్థానాలను గెలుచుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీని కూడా మంత్రివర్గంలో భాగస్వామ్యం చేసింది. అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాలపరిమితిని పెట్టాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. నాటి కేంద్ర క్యాబినెట్లో పోర్ట్ఫోలియో కూడా తీసుకోకుండా ఉన్న మంత్రిగా కేసీఆర్ రికార్డు సృష్టించారు. తెలంగాణ ఇస్తే చాలని, తనకు ఏ శాఖ అవసరం లేదని ఆనాడు కేసీఆర్ చెప్పిన మాట తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ఆయన నిబద్దతకు నిదర్శనం. ఆనాటి రాష్ట్రపతి ప్రసంగంలో కూడా తెలంగాణ ఏర్పాటు అంశం చేర్చడంతోపాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రూపొందించిన కామన్ మినిమం ప్రోగ్రాం’ (సీఎంపీ)లో సైతం తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఉండేలా చేయడంలో కేసీఆర్ విజయం సాధించారు. యూపీఏ మిత్రపక్షాల ఏకాభిప్రాయం సాధించేందుకు, కేంద్రానికి నివేదిక ఇచ్చేందుకు నాటి కేంద్ర మంత్రి ప్రణబ్ముఖర్జీతో కమిటీ కూడా వేయించగలిగారు. దేశంలో 50కిపైగా రాజకీయ పార్టీలను తెలంగాణపై ఒప్పించడంలో కేసీఆర్ విజయం సాధించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కట్టారు. ఉద్యమ రథసారధి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా జూన్ రెండో తేదీన బాధ్యతలు స్వీకరించారు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే అంతా సవ్యంగా లేవు. విభజన సమస్యలు వెంటాడాయి. అధికారులు, సిబ్బంది కేటాయింపు మొదలు రాష్ట్ర వనరుల పంపిణీ వరకు ప్రతీ దాంట్లో కేంద్రంలోని అధికార బీజేపీ నేతృత్వంలోని సర్కారు వివక్ష చూపింది. అనేక ఆటుపోట్లను, అడ్డంకులను తట్టుకొని తెలంగాణ ఇప్పుడు దేశానికి దారి చూపుతోంది. అనేక రంగాల్లో తెలంగాణ రోల్ మాడల్గా నిలిచింది. దేశంలో అత్యంత పిన్నవయసులోనే అద్భుత విజయం సాధించిన రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతికెక్కింది. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తన హామీలను అమలు చేసింది. గడిచిన ఎనిమిదేండ్లలో అనేక పథకాలను ప్రజల కోసం అమలు చేసింది. పాలనలో కూడా ఉద్యమ ఒరవడి కొనసాగించింది. ఇదే స్ఫూర్తితో బీఆర్ఎస్ కూడా దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పును తేవడం తథ్యమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ను నమ్మించి మోసం చేసేందుకు ప్రయత్నించింది. దీంతో 2005లోనే యూపీఏ నుంచి టీఆర్ఎస్ పార్టీ బయటకు వచ్చింది. 2006లో కరీంనగర్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు తిరిగి కేసీఆర్నే గెలిపించారు. ఉమ్మడి పాలకులు హైదరాబాద్ ఫ్రీజోన్ అంటూ తెచ్చిన ఉత్తర్వులను కేసీఆర్, టీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనికి వ్యతిరేకంగా 2009 నవంబర్ 29వ తేదీన కేసీఆర్ అమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. డిసెంబర్ 9న తెలంగాణపై ప్రకటన చేసింది. అయితే, ఆనాటి సమైక్య పాలకులు మళ్లీ కుట్ర చేసి దొంగదీక్షలు చేశారు. దీంతో రాష్ట్ర ఏర్పాటుపై ప్రతిష్టంభన ఏర్పడింది. అనంతరం 2009 నుంచి 2013 వరకు టీఆర్ఎస్ పార్టీ కేంద్ర, రాష్ర్టాల్లో కొట్లాడుతూనే ఉన్నది. 2009 నుంచి 2013 మధ్య ప్రతీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీనే గెలిచింది. కేసీఆర్ వ్యూహం, ఎత్తుగడ, ఉద్యమ పంథా ఫలించి 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
జడ్పీటీసీ సభ్యులు : 85
జడ్పీ చైర్మన్లు : 2
ఎంపీటీసీ సభ్యులు : 100
సర్పంచ్లు : 3,000
వార్డు సభ్యులు : 12,000
ఎమ్మెల్యేలు : 26
ఎంపీలు : 5
జడ్పీటీసీ సభ్యులు : 480
జడ్పీ చైర్మన్లు : 32
సర్పంచులు : 10,000
ఎంపీటీసీ సభ్యులు : 5,000
ఎంపీపీలు : 480
మున్సిపల్ చైర్మన్లు : 136
ఎమ్మెల్యేలు : 103
ఎంపీలు : 16 మంది
(9 మంది లోక్సభ,
7 రాజ్యసభ)
ఎమ్మెల్సీలు : 36