జూన్లో ఆల్టైం హైకి చేరిక..
26.18 బిలియన్ డాలర్లుగా నమోదు
న్యూఢిల్లీ, జూలై 14: దేశీయ ఎగుమతులు-దిగుమతుల మధ్య అంతరం అంతకంతకూ పెరిగిపోతున్నది. దీంతో గత నెల వాణిజ్య లోటు మునుపెన్నడూ లేనిస్థాయికి ఎగబాకింది. జూన్లో రికార్డు గరిష్ఠాన్ని తాకుతూ 26.18 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గురువారం కేంద్ర వాణిజ్య మంత్రి త్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశం నుంచి ఎగుమతులు 40.13 బిలియన్ డాలర్లుగా ఉంటే.. దేశంలోకి దిగుమతులు 66.31 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గతంతో పోల్చితే ఈ జూన్లో ఎగుమతులు 23.52 శాతం, దిగుమతులు 57.55 శాతం పెరిగాయి. అయితే వీటికి తగ్గట్టుగా వాణిజ్య లోటూ ఎగిసిపడింది. నిరుడు జూన్లో 9.6 బిలియన్ డాలర్లుగానే ఉన్నది. నిజానికి ఈసారి వాణిజ్య లోటును 25.63 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. అయినప్పటికీ దాన్ని దాటేసి నమోదు కావడం ఇప్పుడు కలవరపెడుతున్నది.
మే నెలలోనూ..
ఈ ఏడాది మే నెలలోనూ దేశ వాణిజ్య లోటు రికార్డు గరిష్ఠంగానే నమోదైంది. అప్పుడు 24.3 బిలియన్ డాలర్లుగా ఉన్నది. ఇదే ఇప్పటిదాకా ఆల్టైం హై. ఇప్పుడు దీన్ని చెరిపేస్తూ జూన్లో కొత్త రికార్డు వచ్చింది. ఇక గత ఏడాది జూన్తో పోల్చితే వాణిజ్య లోటు 172.7 శాతం పెరగడం గమనార్హం.