Srisailam | శ్రీశైల మహా క్షేత్రం శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు త్రయోదశి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) లవన్న తెలిపారు. ప్రధానాలయ ప్రాకారం త్రిఫల వృక్షం క్రింద కొలువైన దత్తాత్రేయస్వామి (శ్రీపాద వల్లభుడు)కి గురువారం ఆయన ప్రత్యేక పూజలను చేశారు. లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ ఉదయం అభిషేక అర్చనలు చేశారు.
అలాగే ప్రదోషకాల సమయంలో నందిమండపంలోని శనగల బసవన్నకు పంచామృతాభిషేకాలు జరిపించారు. అటుపై బసవన్నకు నానబెట్టిన శనగల నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు.
శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు తెరవడంతోపాటు వరుస సెలవులు రావడంతో భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉన్నది. కనుక వివిధ ప్రాంతాల నుండి శ్రీశైల మహాక్షేత్రానికి వస్తున్న భక్తులు ముందస్తుగా ఆన్లైన్లో వసతి గదుల కేటాయింపు చేసుకుని ఆలయ సిబ్బందికి సహకరించాలని ఈవో లవన్న కోరారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులందరికీ స్వామి అమ్మవార్ల దర్శనాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఉభయ దేవాలయాలతోపాటు హఠకేశ్వరం, ఫాలధార పంచధార, సాక్షి గణపతి, శిఖరేశ్వర ఆలయాలకు కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ జాం సమస్యలు తలెత్తకుండా ఉండేలా చూసుకోవాలని అధికారులను సూచించారు.