హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న పోడు భూముల సమస్య త్వరలో పరిష్కారం కానున్నది. అటవీ భూములపై ఆధారపడి జీవనం సాగించే గిరిజనుల జీవనాధారం దెబ్బతినకుండా, న్యాయబద్ధంగా జీవనభృతి కోసం సాగుచేసుకొంటున్న రైతులను గుర్తించేందుకు కచ్చితత్వాన్ని పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన సాగుదారులకు హక్కులు కల్పించడంతోపాటు బినామీ పోడు సాగుదారులను తప్పించడం ద్వారా అన్యాక్రాంతమైన అడవులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం అనేక మార్గాలను అన్వేషిస్తున్నది. పోడు భూముల పేరుతో రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల శాసనసభలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ప్రకటించారు. అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. గిరిజన సంక్షేమశాఖ మంతి సత్యవతిరాథోడ్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. పలుమార్లు సమావేశమైన ఉపసంఘం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, నివేదిక రూపొందిస్తున్నది. అటవీశాఖ ఉన్నతాధికారుల బృందం కూడా బుధవారం నుంచి మూడ్రోజులపాటు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనున్నది. అనంతరం ఈ నెల 23న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పోడుభూముల సమస్య ఉన్న జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో దాదాపు పోడుభూముల సమస్యకు తుది పరిష్కారం లభించే అవకాశమున్నది. పోడు ఆక్రమణలో ఉన్న గిరిజనేతరులను గుర్తించేందుకు అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమశాఖలతో సంయుక్తంగా ప్రభుత్వం సర్వే చేపడుతున్నది. సంయుక్త విచారణ అనంతరం జిల్లాస్థాయి కమిటీల ద్వారా అనర్హులను తొలగించి, అర్హులైన గిరిజనులకు పోడు హక్కులను కల్పించనున్నది. దీంతో వారికి కూడా ప్రభుత్వం తరుపున అందించే వ్యవసాయ పథకాలన్నీ వర్తించనున్నాయి. అంతేకాకుండా భూమిని ఆక్రమించుకోబోమని రైతుల ద్వారా హామీ పత్రాలను కూడా తీసుకోనున్నారు.
రాజకీయ నాయకుల అండతో కబ్జాలకు పాల్పడినవారు అటవీశాఖ అధికారులపై దాడులకు సైతం తెగబడుతున్నారు. కాగజ్నగర్ అడవుల్లో కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా నరసాల గ్రామంలో 2019 జూన్ 30న మహిళా రేంజ్ అధికారితోపాటు పలువురు సిబ్బందిపై జరిగిన దాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక ఎమ్మెల్యే అండతో ఏకంగా పెద్దపులి సంచరించే కోర్ ఏరియాలోనే కబ్జాలకు పాల్పడ్డారు.
94,273 మందికి అటవీ హక్కుపత్రాలు
సమైక్య రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి హ యాంలో ఆర్వోఎఫ్ఆర్ చట్టం కింద దేశంలోనే అత్యధికంగా పట్టాలిచ్చారు. విచ్చలవిడిగా ఆర్వోఎఫ్ఆర్ కింద హక్కుపత్రాలు ఇచ్చిన రాష్ర్టాల జాబితాలో ఉమ్మడి ఏపీ టాప్లో ఉన్నది. తెలంగాణలో 94,273 మందికి అటవీభూమి హక్కుపత్రాలిచ్చారు. సామాజిక అవసరాల కింద మరో 5 లక్షల ఎకరాలను కేటాయించారు. అయినా తెలంగాణలో మరో ఐదు లక్షల నుంచి పది లక్షల ఎకరాలకు అటవీభూమిలో హక్కుపత్రాలు కావాలనే డిమాండ్ ఉన్నది. అటవీభూముల్లో సాగు చేసుకొంటున్న గిరిజనులు, ఆదివాసీలతో సమస్య లేదు. కానీ రాజకీయ పెద్దల బినామీ కబ్జాల కారణంగానే అడవులు విధ్వంసమవుతున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,36,117 ఎకరాల్లో సాగుచేస్తున్న 37,324 మంది రైతులకు 2006లో అటవీ హక్కుపత్రాలిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో 17,657 మంది రైతులకు 69,654 ఎకరాలు, అసిఫాబాద్ జిల్లాలో 12,635 మందికి 46,329 ఎకరాలు, మంచిర్యాల జిల్లాలో 1,532 మంది రైతులకు 354 ఎకరాలకు, నిర్మల్ జిల్లాలో 5,500 మంది రైతులకు 16,589 ఎకరాలు హక్కుపత్రాలను అందజేశారు.
చాలా ఏండ్లుగా అడవుల్లోనే నివాసముంటూ, పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు, ఇతర సంప్రదాయ తెగలకు చెందినవారికి సదరు భూమిపై యాజమాన్య హక్కుపత్రాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) ఆర్వోఎఫ్ఆర్ చట్టాన్ని 2006 డిసెంబర్ 29న రాష్ట్రపతి ఆమోదించారు. ఈ చట్టం ప్రకారం 13 డిసెంబర్ 2005 కంటే ముందు అటవీభూములపై కబ్జాలో ఉండి, వ్యవసాయం చేసుకొంటున్న గిరిజనులకు, పేదలకు హక్కుపత్రాలు ఇవ్వాలనే నిబంధన ఉన్నది. ఒక్కొక్క కుటుంబానికి గరిష్ఠంగా నాలుగు హెక్టార్లు లేదా పది ఎకరాలకు మించకుండా హక్కుపత్రాలు ఇస్తారు. చట్టం అమల్లోకి వచ్చిన మూడు నుంచి ఆరు నెలల్లోపు ఆర్వోఎఫ్ఆర్ కింద దరఖాస్తు చేసుకున్న వారిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
ఆర్వోఎఫ్ఆర్ చట్టం కింద ఒక కుటుంబం గరిష్ఠంగా 4 హెక్టార్లు లేదా పది ఎకరాల వరకు మాత్రమే హక్కుపత్రాలు పొందడానికి అర్హత ఉంటుంది. కానీ రాష్ట్రంలో కొంతమంది నాయకులు బినామీ పేర్లతో 10 నుంచి 30 ఎకరాల వరకు కబ్జాచేసినట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. గిరిజనేతరులైన వెయ్యి మంది చేతిలోనే సుమారు 25 వేల నుంచి 30 వేల ఎకరాలు అటవీభూమి బందీగా ఉన్నట్టు అధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి. పోడు భూములకు పట్టాలిస్తారనే ప్రచారం జరుగుతున్న నాటినుంచి కబ్జాదారుల ఆగడాలు మరింత పెరిగిపోయాయి. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల వరకు అడవులు విస్తరించి ఉండగా అందులో సుమారు 8 లక్షల ఎకరాలు కబ్జాలతో కనుమరుగైంది. మరో 10 లక్షల ఎకరాలు కబ్జాదారుల కోరల్లో చిక్కుకొన్నది. ఇందులో సుమారు లక్ష ఎకరాలకు ఆర్వోఎఫ్ఆర్ కింద తాము అర్హులమని చాలామంది క్లెయిమ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రొఫెషనల్ స్మగ్లర్లైన ముల్తానీలు, ఖమ్మం జిల్లాలో గొత్తికోయలు అధికార యంత్రాంగానికి పెద్ద సవాల్గా మారారు. రకరకాల ముసుగులో అడవిని చెరబడుతున్న వారికి రాజకీయ నాయకులు తోడవుతున్నారు.