స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రతిఒక్కరిలో దేశభక్తి స్పురించేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ నెల 8 నుంచి 22 దాకా నిర్వహించనున్న వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వాతంత్య్ర పోరాటస్ఫూర్తి రగిలించేలా అంగరంగ వైభవంగా నిర్వహించాలని కార్యాచరణ రూపొందించారు. నేటి నుంచి సినిమా థియేటర్లలో విద్యార్థుల కోసం గాంధీ చిత్ర ప్రదర్శనకు చర్యలు తీసుకుంటూనే, 10న మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో ఫ్రీడం రన్ తీయనున్నారు. 9న ఇంటింటా మువ్వన్నెల జెండాలు పంపిణీ చేసి.. 15న ఇండ్లపై పతాకాలు ఎగురవేసేలా చర్యలు చేపట్టారు.
కరీంనగర్, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ) : వజ్రోత్సవ వేడుకల ఆరంభం అదిరిపోయేలా నిర్వహించాలని సర్కారు ఆదేశాల ఆదేశాల మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 15న అన్ని గృహాలపై జాతీయ జెండాలను ఆవిష్కరించనున్నారు. సిరిసిల్లలో నేత కార్మికుల ద్వారా పెద్ద ఎత్తున జెండాలను తయారు చేస్తున్నారు. ఈ నెల 9న అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఇంటింటికీ వెళ్లి జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేస్తారు.
త్రివర్ణ శోభితమైన చారిత్రక కట్టడం
గంగాధర, ఆగస్టు 7: స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలకు గట్టుభూత్కూర్లోని పురాతన బురుజు సిద్ధమైంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి కాలక్రమేణా శిథిలావస్థకు చేరిన ఆ పాత కట్టడానికి స్థానిక సర్పంచ్ కంకణాల విజేందర్రెడ్డి తన సొంత ఖర్చులు రూ.7.60లక్షలతో మరమ్మతులు చేయించి త్రివర్ణ పతాక ఆకారంలో రంగులు వేయించగా, సరికొత్త శోభను సంతరించుకున్నది. ప్రభుత్వ సూచనల మేరకు నేటి నుంచి 20 దాకా వేడుకలకు పంచాయతీ పాలకవర్గం ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా, సర్పంచ్ కంకణాల విజేందర్రెడ్డి మాట్లాడుతూ వందల ఏళ్లనాటి బురుజు శిథిలావస్థలకు చేరడంతో ప్రత్యేక మరమ్మతు చేయించానని, ఇక్కడ వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని సర్పంచ్ కంకణాల విజేందర్రెడ్డి ‘నమస్తే’తో పేర్కొన్నారు.
ఫ్రీడం ఫైటర్ కేవీ కేశవులు స్వగృహంలో వేడుకలు
మంత్రి కొప్పుల ఆదేశాలతో ఏర్పాట్లు
2018 ఆగస్టు 15న కుటుంబ సభ్యులతో కలిసి జెండా ఎగురవేస్తున్న కేశవులు(ఫైల్)
ధర్మపురి, ఆగస్టు 7: బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా, రజాకార్ల దమననీతికి విరుద్ధంగా అనేక ఉద్యమాలు నడిపిన యోధుడు. స్వాతంత్రం సిద్ధించిన రోజు నిజాం ఆదేశాలకు వ్యతిరేకంగా తన స్వగృహంపై జెండా ఎగరేసిన వీరుడు. ఆయనే మన కేవీ కేశవులు. ధర్మపురిలోని ఆయన ఇల్లు వజ్రోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్నది. మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా డీసీఎమ్మెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి పర్యవేక్షణలో సర్వం సిద్ధం చేస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న కేశవులు గృహాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ నెల 9న కేశవులు ఇంటిపై మంత్రి ఈశ్వర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని, అదే రోజు ఇంటింటికీ జాతీయ పతాకాలు పంపిణీ చేస్తారని శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు.
కరీంనగర్లో ప్రత్యేకంగా..
వజ్రోత్సవ వేడుకల ఆరంభం అదిరిపోయేలా నిర్వహించాలని మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. నేడు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియం నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానం దాకా భారీ ర్యాలీ తీస్తారు. ఇందులో భాగంగా ఆర్మీ, పోలీసు బ్యాండ్తోపాటు రాష్ట్రీయ శాల్యూట్ జాతీయ గీతాలాపన, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లాలోని 3,08,427 నివాస గృహాలపై జెండాలు ఎగరేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఇంకా 11న ఫ్రీడం రన్లో భాగంగా జిల్లా కేంద్రమైన కరీంనగర్లో 30 మందితో రన్ చేపట్టాలని నిర్ణయించారు. మంత్రి గంగులతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ పర్యవేక్షణలో ఫ్రీడం రన్కు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఊరూరా ఫ్రీడం పార్కులు
వేడుకల్లో భాగంగా ఈ నెల 10న ఊరూరా ఫ్రీడం పార్కులు ఏర్పాటు చేనున్నారు. ఇందులో భాగంగా ప్రతి పంచాయతీ, మున్సిపాలిటీల్లో వనమహోత్సవాలు నిర్వహించనున్నారు. గుర్తించిన స్థలాల్లో 750 మొక్కలు ఒకేసారి నాటాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ఆకర్షణీయమైన మొక్కలు పెట్టి ఆ ప్రాంతాన్ని ఫ్రీడం పార్కుగా ప్రకటించాలని నిర్ణయించారు. ఈ నెల 11న అన్ని మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో ఫ్రీడం రన్ నిర్వహిస్తున్నారు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని చాటేలా ఈ ర్యాలీ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
పెద్దపల్లిలో..
వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సంగీత సత్యనారాయణ ఆదేశాల మేరకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. రెగ్యులర్ ప్రోగ్రామ్స్తోపాటు ప్రత్యేకంగా విద్యార్థుల్లో దేశభక్తిని స్పురించేలా 6 నుంచి 10వ తరగతి చదివే 42వేల మంది కోసం నేటి నుంచి జిల్లాలోని సినిమా థియేటర్లలో గాంధీ చిత్ర ఉచిత ప్రదర్శన చేపట్టనున్నారు. ఇంకా జిల్లాలో 2.30లక్షల ఇండ్లపె జెండాలు ఎగరేసేలా ప్రణాళికలు రూపొందించారు. వజ్రోత్సవాలను జిల్లాలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు విధిగా పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
రాజన్న సిరిసిల్లలో..
వజ్రోత్సవ వేడుకలు అంబరాన్నంటేలా నిర్వహించాలని మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కలెక్టర్ అనురాగ్ జయంతి ఆధ్వర్యంలో యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. షెడ్యూల్ ప్రకారం జరిపేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. రెగ్యులర్ ప్రోగ్రామ్స్తోపాటు ప్రత్యేకంగా విద్యార్థుల్లో దేశభక్తిని స్పురించేలా జిల్లాలోని సినిమా థియేటర్లలో గాంధీ చిత్ర ఉచిత ప్రదర్శన చేపట్టనున్నారు. ఇంకా ఇంకా జిల్లాలో 1.79లక్షల ఇండ్లపె జెండాలు ఎగరేసేలా ప్రణాళికలు రూపొందించగా, రేపు కలెక్టరేట్లో కలెక్టర్ త్రివర్ణ పతాకాలు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు వజ్రోత్సవ కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.