హైదరాబాద్: వృక్షాలు జీవవైవిధ్యానికి, పర్యావరణ సమతుల్యానికి ప్రతీకలని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. జీవావరణంలో వృక్షాల ప్రాధాన్యతను చాటి చెప్పేలా యాభై ఏండ్ల క్రితం ‘ట్రీ ఆఫ్ యూనిటీ’ పేరుతో రూపొందించిన ఓ షార్ట్ ఫిల్మ్ ను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
నేలను చీల్చుకొని వచ్చిన ఓ మొక్క మహావృక్షంగా ఎదిగేందుకు, దాన్ని రక్షించేందుకు పర్యావరణ పరిక్షరక్షకులంతా ఏకమై ముందుకు సాగిన తీరును ఈ వీడియో కళ్లకు కడుతుంది. పక్షులు, మనుషుల ఆకలి తీర్చేందుకు ఫలాలనిస్తూ, సేదతీరేందుకు నీడనిస్తూ తన బాహువులను పరిచిన ఆ మహావృక్షాన్ని నేలమట్టం చేసి లాభపడాలనుకున్న ఓ వ్యక్తికి చివరకు ఎలా జ్ఞానోదయమైందనే సందేశాన్ని ఈ వీడియో అందిస్తుంది. పర్యావరణ పరిక్షణకు చెట్లను సంరక్షించాల్సిన అవసరాన్ని ఈ వీడియో నొక్కి చెబుతుంది.