శ్రీశైలం : త్రయోదశి తిథి సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో
సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. మాసోత్సవం సందర్భంగా త్రయోదశి ప్రదోషకాలంలో పరోక్ష సేవగా శనగల బసవన్నకు శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించినట్లు దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. ఆలయ అర్చకులు, వేద పండితులు మహాసంకల్పాన్ని పఠించి, ఫలోదకాలు, పరిమళ సుగంధ ద్రవ్య జలాలు, ఆలయ గుండాల నుంచి సేకరించిన శుద్ధ జలాలతో బసవన్నను అభిషేకించారు. అనంతరం నూతన వస్త్రాలు సమర్పించి, నానబెట్టిన శనగలను నివేదించారు.
బసవన్న పరోక్ష సేవకు వివిధ దేశాల్లో ఉన్న భక్తుల నుంచి మంచి స్పందన వస్తుందని ఈవో తెలిపారు. ప్రధాన ఆలయం ఎదుటనున్న నంది మండపంలో కొలువైన నందీశ్వర స్వామిని శనగల బసవన్నగా పిలుస్తూ.. భక్తులు మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా వస్తున్నది. ఆసక్తి ఉన్న భక్తులు పరోక్ష సేవల్లో పాల్గొనేందుకు గోత్రనామాలతో tms.ap.gov.in, srisailadevasthanam.orgలో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 83339 01351-6 కాల్ సెంటర్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.