హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : దళిత జర్నలిస్టులకు ఈనెల 26, 27 తేదీల్లో ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహిస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. శనివారం హైదరాబాద్లోని ఎఫ్డీసీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జర్నలిజంలో దళితుల అస్తిత్వం, ప్రభుత్వ పథకాల్లో వారి భాగస్వామ్యం తదితర అంశాలపై శిక్షణా తరగతుల్లో అవగాహన కల్పిస్తామన్నామని చెప్పారు. దళితుల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా దళిత జర్నలిస్టులు కృషి చేయాలని సూచించారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంకులోని జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈ శిక్షణా తరగతులు ఉంటాయని తెలిపారు. 26న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, దళితబంధు, ఎస్సీ సబ్ప్లాన్పై బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, డిజిటల్ మీడియాపై సీనియర్ జర్నలిస్టు బుర్రా శ్రీనివాస్, 27న ‘పత్రికల భాష, తప్పొప్పులు, దిద్దుబాటుపై సీనియర్ జర్నలిస్టు చిల్ల మల్లేశం, దళిత జర్నలిస్టుల ప్రత్యేక అస్తిత్వం, జర్నలిజంలో దళితుల భాగస్వామ్యం, పాత్రపై టీఎస్పీఎస్సీ మాజీ అధ్యక్షుడు ఘంటా చక్రపాణి, నేర వార్తల సేకరణ, ప్రచురితం తదితర అంశాలపై సీనియర్ జర్నలిస్టు గోవిందరెడ్డి, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పరస్పర ఆధారితాలపై సీనియర్ జర్నలిస్టు బుచ్చన్న శిక్షణ ఇస్తారని వివరించారు.