హైదరాబాద్: మరికొన్ని గంటల్లో మెదక్కు రైలు కూతపెట్టనుంది. అక్కన్నపేట-మెదక్ మధ్య రైల్వే సేవలు నేటినుంచి అందుబాటులోకి రానున్నాయి. తొలి రైలును మంత్రి హరీశ్ రావుతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ప్రారంభించనున్నారు. దీంతో ఈరోజు సాయంత్రం మెదక్ నుంచి కాచిగూడకు మొదటి రైటు బయలుదేరనుంది. కొత్తగా నిర్మించిన 17.2 కిలోమీటర్ల రైల్వే లైను ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. దీంతో వారంలో అన్ని రోజులూ మెదక్-కాచిగూడ మధ్య రైళ్లు నడిచేలా అధికారులు ఏర్పాటు పూర్తిచేశారు. మొత్తం 17 స్టేషన్ల మీదుగా రైలు ప్రయాణించనుంది.
మెదక్-అక్కన్నపేట రైల్వే లైన్ 17.2 కిలోమీటర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.210.75 కోట్ల నిధులు మంజూ రు చేశాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.85.75 కోట్లు మంజూరు చేయగా, కేంద్ర ప్రభుత్వం 50శాతం నిధులను మంజూరు చేసింది. అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ మార్గంలో మూడు స్టేషన్లను ఏర్పాటు చేశారు. అక్కన్నపేట, లక్ష్మాపూర్, శమ్నాపూర్తో పాటు మెదక్ రైల్వే స్టేషన్ను నిర్మించారు. ఈ లైన్తోమెదక్ నుంచి అక్కన్నపేట, మిర్జాపల్లి మీదుగా సికింద్రాబాద్ రైల్వేలైన్కు అనుసంధానం చేశారు.
కాచిగూడ నుంచి మెదక్కు స్పెషల్ ట్రైన్ నడుపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ట్రైన్ నంబర్ 071577 ఈ ట్రైన్ కాచిగూడ నుంచి ఉదయం 7.45 గంటలకు బయలుదేరి 11.10 గంటలకు మెదక్కు చేరుకుంటుంది. ఈ ట్రైన్ సీతాఫల్మండి, మల్కాజిగిరి, కావలరి బ్యారక్స్, బొల్లారం, గుండ్లపోచంపల్లి, గౌడవెల్లి, మేడ్చల్, డబిలిపూర్, మనోహరాబాద్, మాసాయిపేట, శ్రీనివాస్నగర్, వడియారం, అక్కన్నపేట, లక్ష్మాపూర్, శమ్నాపూర్ స్టేషన్ల మీదుగా మెదక్ రైల్వేస్టేషన్లో ఆగుతుంది.
సాయంత్రం 5.10 గంటలకు మెదక్ నుంచి బయలుదేరి కాచిగూడకు 7.20 గంటలకు చేరుకుంటుంది. శమ్నాపూర్, లక్ష్మాపూర్, అక్కన్నపేట, మిర్జాపల్లి, వడియారం, శ్రీనివాస్నగర్, మాసాయిపేట, బ్రహ్మణపల్లి, మనోహరాబాద్, డబిలిపూర్, మేడ్చల్, గౌడవెల్లి, గుండ్లపోచంపల్లి, బొల్లారం, బ్యారక్స్, మల్కాజీగిరి, సీతాఫల్మండి స్టేషన్ల మీదుగా కాచిగూడకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. అలాగే మహబూబ్నగర్ నుంచి సాయంత్రం 4.20 గంటలకు ప్యాసింజర్ రైలు ప్రారంభమై కాచిగూడకు 7.20 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి మెదక్కు రాత్రి 10.30 గంటలకు చేరుకుంటుంది.