ఎల్బీనగర్, మే 27: యువతులను అక్రమ రవాణా, ఇంటర్ స్టేట్ హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడుతున్న ఇద్దరు నిర్వాహకులపై పోలీసులు పీడీ యాక్టును నమోదు చేశారు. వారి నుంచి నలుగురు బాధిత మహిళలను రక్షించి రెస్క్యూ హోంకు తరలించారు. ఈ సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా, మిర్యాలగూడకు చెందిన అల్లాని శ్యామ్(49), విజయవాడకు చెందిన రామిశెట్టి సంధ్య(32) కలిసి చైతన్యపురి, అల్కాపురి రోడ్ నం.14లో సాయిసదన్ అపార్ట్మెంట్లో నివాసముంటూ అసోసియేట్ ద్వారా లోకాన్టో వెబ్సైట్లో అమ్మాయిల ఫొటోలు, ఫోన్ నంబర్లను సేకరించి ఆకట్టుకుంటున్నారు. కళాశాలకు వెళ్లే విద్యార్థినులు, యువతులను, పేదరికంలో ఉన మహిళలను ఆకర్షించి వారిని ఇతర రాష్ర్టాలకు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.
సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు స్థావరంపై దాడులు నిర్వహించి అల్లాని శ్యామ్, రామిశెట్టి సంధ్యను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఏపీ రాష్ర్టాలకు చెందిన నలుగురు మహిళలను రక్షించి రెస్క్యూ హోంకు తరలించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి పీడీ యాక్టు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.