హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): దేశంలో పెరుగుతున్న వాహనాల సంఖ్యతో ప్రధాన పట్టణాలు ట్రాఫిక్ సుడిగుండంలో చిక్కుకుంటున్నాయి. పెరిగిన వాహనాల సంఖ్యకు తగినట్టు మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడంతో ఆయా రాష్ర్టాలను ట్రాఫిక్ సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ప్రత్యేకంగా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. బెంగళూరు, ముంబై నగరాల్లో వాహనదారులు ట్రాఫిక్లో చిక్కుకుని గంటల పాటు రోడ్లపై నరకం చవిచూస్తున్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికలతో ట్రాఫిక్ సమస్యలు తొలిగాయి. ప్రస్తుతం హైదరాబాద్లో వాహనాల స్పీడ్ గంటకు 27 కిలోమీటర్లకు చేరింది. మహానగరంలో 80 లక్షల వాహనాల్లో రోజు 40 లక్షల వరకు రోడ్లపైకి వస్తుంటాయి. అయినా ట్రాఫిక్లో వాహనాల స్పీడ్ తగ్గకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నది.
హైదరాబాద్లో శరవేగంగా మౌలిక వసతులు
దేశంలో నిత్యం 53,700 కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఇందులో 60 శాతం వరకు బైక్లు, 25 శాతం కార్లు ఉండగా, మిగతావి ఆటోలు, ట్రాక్టర్లు, లారీలు, బస్సులు ఇతర వాహనాలు ఉన్నాయి. హైదరాబాద్లో దాదాపు 80 లక్షల వాహనాలు ఉన్నాయి. వీటిలో రోజు 40 లక్షల వాహనాలు రోడ్డుపైకి వస్తుంటాయి. వీటికి తోడు ప్రతి రోజు వెయ్యి కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ జరుపుకొంటున్నాయి. వీటి సంఖ్యను పరిగణనలోకి తీసుకొని రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్లు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం 47 ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులను రూ.8,052.92 కోట్లతో చేపట్టింది. వీటిలో 31 చోట్ల పనులు పూర్తయి వాహనాదారులు రాకపోకలు సాగిస్తున్నారు. 15 చోట్ల ఫ్లైఓవర్లు, 5 అండర్పాసులు, ఏడు ఆర్వోబీ/ఆర్యూబీ, ఒక కేబుల్ బ్రిడ్జి, ఓఆర్ఆర్ నుంచి మెదక్ జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ చేసి, ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా అభివృద్ది పనులు చేశారు.
నగరంలో పెరిగిన వేగం
2019లో తెలంగాణలో వాహనాల వేగం గంటకు 24.8 కిలోమీటర్లు ఉండగా 2021 నాటికి 27.5 కిలోమీటర్లకు పెరిగింది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లోని ప్రధాన నగరాల్లో 2019లో 22 కిలోమీటర్లు ఉండగా నేడు 20 నుంచి 18 కిలోమీటర్లకు తగ్గిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబైలోను అదే పరిస్థితి. అస్తవ్యస్తమైన ట్రాఫిక్ వ్యవస్థ, గంటల తరబడి వాహనాలు రోడ్లపై నిలిచి ఉండటంతో వాహనదారులు అనారోగ్యం పాలవుతున్నారు.
ట్రాఫిక్లో చిక్కుకున్న బెంగళూరు పౌరుడి ఆవేదన అతని మాటల్లోనే..
బెంగళూరు మంచి నగరమే కాదనలేను. ఎవరిని అడిగినా బెంగళూరు వాతావరణం బాగున్నదనే చెప్తారు. ట్రాఫిక్లో గంటలకొద్ది ఇరుక్కుపోయి అవస్థలు పడుతుంటే వాతావరణం తప్ప ఇంకేం కనిపిస్తుంది. హైదరాబాద్లో పరిస్థితి ఇలా ఉండదు. రోడ్లు వెడల్పుగా ఉంటాయి. ఒకవైపు మెట్రో.. మరోవైపు ఫ్లై ఓవర్లు ఇలా.. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రయాణించొచ్చు. హైదరాబాద్లో ఒక ప్రాంతానికి వెళ్లేందుకు నాలుగైదు బాటలు ఉంటే.. బెంగళూరులో జిలేబీలాగా అక్కడక్కడే తిరుగుతుండాల్సిందే. ఇవన్నీ వదిలేసి వెదర్ బాగుంది అనడం ఎంత వరకు కరెక్ట్!