నల్లగొండ : విద్యుత్ స్తంభాల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడి ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా డిండి మండలం టి.గౌరారం స్టేజీ వద్ద శనివారం ఈ దుర్ఘటన జరిగింది.
డిండి మండలం నెమలిపురి పంచాయతీ పరిధిలోని రేగళ్లగడ్డ తండాకు చెందిన ఇద్దరు యువకులు కామేపల్లి సబ్స్టేషన్ నుంచి ట్రాక్టర్లో బొలన్పల్లికి విద్యుత్ స్తంభాలను తీసుకువస్తున్నారు.
టి.గౌరారం వద్దకు రాగానే ట్రాక్టర్ అదుపుతప్పి ట్రాలీతో సహా బోల్తాపడటంతో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
స్తంభాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి తునాతునకలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు