ముందుకు వచ్చిన కరీంనగర్ జిల్లా ఇస్తారిపల్లి వాసులు
మిగతా జిల్లాల్లోనూ స్వచ్ఛందంగా తరలివస్తున్న లబ్ధిదారులు
రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతున్న సభ్యత్వ నమోదు
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఫిబ్రవరి 24: టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతున్నది. పలు జిల్లాల్లో ఊళ్లకు ఊళ్లు టీఆర్ఎస్కు బాసటగా నిలుస్తున్నాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ అనుబంధ గ్రామం ఇస్తారిపల్లి వాసులు మూకుమ్మడిగా బుధవారం సభ్యత్వం తీసుకున్నారు. ఇక్కడ 140 మంది ఓటర్లు ఉండగా 120 మంది సభ్యత్వం తీసుకున్నారు. ఇందులో 52 మంది వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందారు. గతంలో టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందగా అతడి కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం వచ్చింది. ఇన్ని పథకాల ద్వారా లబ్ధిపొందిన తాము టీఆర్ఎస్కు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొన్నారు.
వలస జీవులు సైతం..
ఏపీలోని పలు జిల్లాల నుంచి కొందరు 25 ఏండ్ల క్రితం మంచిర్యాల జిల్లా చెన్నూర్కు వలస వచ్చి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితు లై 35మంది టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు.
టీఆర్ఎస్ పవర్ఫుల్ పార్టీ: వినోద్
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తోటపల్లిలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. ఈ సం దర్భంగా వినోద్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పవర్ఫుల్ పార్టీ అని, అత్యధిక సభ్యత్వాలు గల పార్టీ గా అవతరించేందుకు విసృత్తంగా సభ్యత్వ నమో దు చేయాలన్నారు. ఖమ్మం జిల్లా వేంసూరు మం డలం వెంకటాపురంలో ఉద్యమకారులైన గండ్ర కేశవరెడ్డి, లేళ్ల లోకేశ్వర రెడ్డిలకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సభ్యత్వాలను అందజేశారు.
ధర్మపురి టాప్
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో టీఆర్ఎస్ సత్తాచాటింది. 50 వేల సభ్యత్వ లక్ష్యాన్ని కేవ లం 10 రోజుల్లోనే పూర్తి చేసినట్టు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ఇందులో 32,500 సాధారణ సభ్యత్వం కాగా.. 17,500 క్రియాశీల సభ్యత్వాలున్నాయన్నారు. తక్కువ సమయంలో లక్ష్యాన్ని పూర్తి చేసిన నాయకులను మంత్రి అభినందించారు.
సర్కారుకు కృతజ్ఞతగా
మాకు ఇద్దరు బిడ్డలు అక్షయ(9), నందు(4). పెద్ద బిడ్డకు క్యాన్సర్ రావడం తో హైదరాబాద్లోని ఓ దవాఖానలో చేర్పించినం. చికిత్స చేయించేందుకు లక్ష లు ఖర్చవుతాయని డాక్టర్లు చెప్పడంతో మస్తు ఆగమైనం. మా బిడ్డ పరిస్థితి జూసి తల్లడిల్లినం. మంత్రి కొప్పుల సారును కలిసి గోడు వెళ్లబోసుకున్నం. సారు ధైర్యం చెప్పిండు. దవాఖాన ఖర్చులు ఇప్పిస్తనని చెప్పి వెంటనే రూ.4 లక్షల ఎల్వోసీ ఇచ్చిం డు. వెంటనే డాక్టర్లు చికిత్స చేసిండ్రు.. ఇప్పుడు మా బిడ్డ కోలుకున్నది. సర్కారు చేసిన సాయాన్ని మరువలేకే మాజీ సర్పం చ్ రమేశ్ను కలిసి టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నం. మాకు జీవమున్నంత కాలం సీఎం కేసీఆర్ను తలుచుకుంటం.
లక్ష్మీనారాయణ, లక్ష్మి దంపతులు, గ్రా:దొంగతుర్తి, మం:ధర్మారం, పెద్దపల్లి