న్యూఢిల్లీ, జూలై 26: ఒకవైపు స్టార్టప్లో వేలాది మంది సిబ్బందిని తొలగిస్తుంటే..మరోవైపు దేశీయ ఐటీ సంస్థలు వేలాది మంది సిబ్బందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీ, టెక్ మహీంద్రాలు సంయుక్తంగా 59,704 మంది ఉద్యోగులను నియమించుకున్నాయి. గతేడాది చివరి త్రైమాసికంలో నియమించుకున్న 85,720 కంటే తక్కువే, అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతటి స్థాయిలో సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడం విశేషమని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నారు. వరుస త్రైమాసికాలతో పోలిస్తే టీసీఎస్, హెచ్సీఎల్, ఇన్ఫోసిస్ నియామకాలు తగ్గగా..కానీ, విప్రో, టెక్ మహీంద్రాలు మాత్రం అత్యధిక మందిని రిక్రూట్ చేసుకున్నాయి. ఐటీ కంపెనీల ఆపరేటింగ్ మార్జిన్లు పెరగడంతోపాటు ఆర్డర్లు భారీగా పెరగడంతో ప్రతిభ కలిగిన సిబ్బంది కోసం క్యాంపస్ల నుంచి తీసుకుంటున్నారు.
తప్పని వలసల బెడద
ఐటీ సంస్థలకు వలసల బెడద తప్పడం లేదు. నానాటికి ఇది పెరిగి రెండంకెల స్థాయిలో నమోదవుతున్నది. వలసలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థలు..దీనిని అధిగమించుకోవడానికి నియామకాలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తున్నది. గత త్రైమాసికంలో ఇన్ఫోసిస్, టీసీఎస్ అట్రిటేషన్ రేటు పెరగగా..విప్రో, టెక్ మహీంద్రాల వాటా తగ్గింది.