మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాల్లో తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1026మంది ఓట్లు వేయనున్నారు. బ్యాలెట్ విధానంలో ఈ ఎన్నిక జరగనుంది. శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, కలెక్టర్లు పోలింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు. సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించారు. ఈ నెల 14న మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కౌంటింగ్ జరుగనుండగా, కొవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
సిద్దిపేట, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. రేపు శాసనమండలికి ఎన్నిక నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం పోలింగ్ జరుగనున్నది. ఇందుకోసం పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది, బందోబస్తు తదితర ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మొత్తం ముగ్గురు ఉన్నారు. టీఆర్ఎస్ తరఫున డాక్టర్ వంటేరి యాదవరెడ్డి, కాంగ్రెస్ నుంచి తూర్పు నిర్మల, స్వతంత్ర అభ్యర్థిగా మట్ట మల్లారెడ్డి పోటీ పడుతున్నారు. కాగా, ఎన్నికల నిర్వహణకు 9 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సిద్దిపేటలో 2, మెదక్లో 3, సంగారెడ్డి జిల్లాలో 4 పోలింగ్ స్టేషన్లు పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలకు మొత్తం 1026మంది ఓటర్లు ఉండగా, ఇందులో 454 మంది పురుషులు, 572మంది మహిళలు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పురుషుల కన్నా మహిళా ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. స్థానిక సంస్థలకు చెందిన కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎక్స్అఫీషియో సభ్యులు ఓటు వేయనున్నారు. శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉమ్మడి జిల్లాలోని 9 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. శాసనమండలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, మెదక్ కలెక్టర్ హరీశ్ పోలింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎన్నికల నిర్వహణకు సెక్టోరల్ ఆఫీసర్ 10 మందికిగాను వీరిలో ఒకరు రిజర్డు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు 12 మంది వీరిలో 3 రిజర్డు, మైక్రో అబ్జర్వర్స్ 9, ప్రిసైడింగ్ అధికారులు 11 మంది వీరిలో 2 రిజర్డులో ఉన్నారు. పోలింగ్ సందర్భంగా పోలీస్శాఖ గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది. డిసెంబర్ 14న మెదక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కౌంటింగ్ జరుగనున్నది. బ్యాలెట్ పేపర్ ఆధారంగా ఎన్నికలు జరుగుతాయి. కరోనా నేపథ్యంలోఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలకు పాటించాలే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో 9 పోలింగ్ కేంద్రాలు
స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల నిర్వహణకు సిద్దిపేట జిల్లాలో 2, సంగారెడ్డి జిల్లాలో- 4, మెదక్ జిల్లాలో 3 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రం 4లో అత్యధికంగా 239మంది, పోలింగ్ కేంద్రం 3లో అతి తక్కువగా 36 మంది ఓటర్లున్నారు. పోలింగ్ కేంద్రం -1, ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర) మెదక్లో 150 మంది తమ ఓటు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 64, మహిళలు 86 మంది ఉన్నారు. పోలింగ్ కేంద్రం 2 నర్సాపూర్ డివిజన్, నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేశారు. పురుషులు 31, మహిళలు 37 మంది మొత్తం 68 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. పోలింగ్ కేంద్రం 3 మెదక్ జిల్లాలోని తూప్రాన్ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో పురుషులు 27, మహిళలు 36 ఓటు వేస్తారు. పోలింగ్ కేంద్రం 4 సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్లో ఏర్పాటు చేయగా, పురుషులు 106, మహిళలు 133 మొత్తం 239 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రం 5 అందోల్ ఆర్డీవో కార్యాలయంలో పెట్టగా, ఇక్కడ పురుషులు 31మంది, మహిళలు 40మంది మొత్తం 71 మంది ఉన్నారు. పోలింగ్ కేంద్రం 6 నారాయణ్ఖేడ్ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేయగా, పురుషులు 37, మహిళలు 52 మొత్తం 89 మంది తమ ఓటు వేయనున్నారు. పోలింగ్ కేంద్రం 7 జహీరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేయగా, పురుషులు 36మంది, మహిళలు 49మంది మొత్తం 85 మంది ఉన్నారు. పోలింగ్ కేంద్రం 8 సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పెట్టగా, పురుషులు 72, మహిళలు 90 మొత్తం 162 మంది ఓటు వేస్తారు. పోలింగ్ కేంద్రం 9 గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేయగా, పురుషులు 50, మహిళలు 49 మొత్తం 99మంది ఓటు వేయనున్నారు.
జోష్లో టీఆర్ఎస్..
అధికార టీఆర్ఎస్ మంచి జోష్లో ఉన్నది. ఎన్నికలు ఏవైనా ఉమ్మడి మెదక్ జిల్లాలో గెలుపు టీఆర్ఎస్ సొంతం. శాసనమండలి ఎన్నికల్లో సైతం మంచి మెజార్టీతో గెలుపొందడం ఖాయం. జిల్లాలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారనే ధీమాలో ఆ పార్టీ నాయకులున్నారు. ప్రస్తుత స్థానిక సంస్థల్లో 90 శాతానికి పైగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే ఉన్నారు. ఇతర పార్టీల్లో ఉన్న మరికొంత మంది సైతం టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయనున్నట్లు సమాచారం. గత నెల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే, టీఆర్ఎస్ అభ్యర్థిగా గజ్వేల్కు చెందిన డాక్టర్ యాదవరెడ్డిని సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ముగియగానే, టీఆర్ఎస్ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గస్థాయి సమావేశాలకు మంత్రి హరీశ్రావు హాజరై, పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి విస్తృత ప్రచారం చేశారు. ఆయా నియోజకవర్గాల్లోని స్థానిక శాసనసభ్యులు, ఇతర సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేశారు. మొత్తం 1026 మంది ఓటర్లు ఉన్నారు.