హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ఇంటింటా జాతీయ జెండా రెపరెపలు.. గాంధీ చలన చిత్ర ప్రదర్శనలు.. సామూహిక జాతీయ గీతాలాపన.. వజ్రోత్సవ పార్కులు.. హరితహారాలు.. కవి సమ్మేళనాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు.. ఆహా! ఇదే కదా అసలైన జెండా పండుగ. రెండు వారాల పాటు ప్రతి గుండెలో దేశ భక్తి ఉప్పొంగేలా నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు సోమవారంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం మువ్వన్నెల రంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక్కడ ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఎంపీపీలు, జడ్పీటీసీలు, డీసీసీబీ చైర్మన్లు, దేవస్థానం కమిటీ చైర్మన్లు, మున్సిపల్ కమిషనర్లు, మేయర్లు, జిల్లా కలెక్టర్లు సహా జిల్లా స్థాయి అధికారులు.. మొత్తంగా 30 వేల మంది హాజరుకానున్నారు. వేడుకల ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు.
సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో ముందుగా మహాత్మాగాంధీకి సీఎం కేసీఆర్ నివాళి అర్పిస్తారు. అనంతరం జాతీయ గీత ఆలాపనతో ముగింపు వేడుకలు ప్రారంభమవుతాయి. ప్రముఖ సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ మ్యూజికల్ కాన్సర్ట్, శివమణి సంగీత వాయిద్య విన్యాసం, పద్మశ్రీ పద్మజారెడ్డి బృందం శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, వార్సీ బ్రదర్స్ ఖవ్వాలీ, స్థానిక కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి. రెండు వారాల పాటు నిర్వహించిన కార్యక్రమాలను తెలిపే లఘుచిత్రం, లేజర్ షోతో పాటు భారీ ఎత్తున పటాకుల ప్రదర్శనలతో వేడుకలు ముగుస్తాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల నుంచి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల మహిళలను కూడా ఉత్సవాలకు ఆహ్వానించారు. కాగా, స్వాతంత్య్ర సమరయోధులు, దేశం కోసం పోరాడినవారి త్యాగాలను గౌరవిస్తూ వారి కుటుంబ సభ్యులను ప్రభు త్వం సన్మానించనున్నది. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాల నుంచి సురవరం ప్రతాపరెడ్డి మనుమడు అనిల్కుమార్రెడ్డి, భాగ్యరెడ్డివర్మ మనుమడు అజయ్ గౌతమ్, గల్వాన్ లోయలో వీరమరణం పొందిన కర్నల్ సంతోష్బాబు సతీమణి సంతోషి, కుమ్రం భీం మనుమడు కుమ్రం సోనేరావు, వనజీవి రామయ్య, రావెళ్ల వెంకటరామారావు మనుమడు రావెళ్ల మాధవరావు, అంతర్జాతీయ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారులను సీఎం సన్మానిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా, ఇంటింటా జాతీయ పతాకం ఎగురవేయాలన్న సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ప్రభుత్వం కోటీ 20 లక్షల జాతీయజెండాలను ప్రతి ఇంటికి పంపిణీ చేసింది. వేడుకల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగరేసి తెలంగాణ ప్రజలు చరిత్ర సృష్టించారు. అటు.. తొలి ప్రధాని నెహ్రూ విగ్రహం సాక్షిగా అబిడ్స్లోని నెహ్రూ చౌరస్తాలో ఈ నెల 16న జరిగిన సామూహిక గీతాలాపనలో సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొని, జాతికి స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేశారు.
వజ్రోత్సవ పారులను ఏర్పాటు చేయడం,హరితహారంలో భాగంగా లక్షల మొకలు నాటడం, కవి సమ్మేళనాలు, ముషాయిరాల నిర్వహణ తదితర కార్యక్రమాలు ప్రజాస్వామికవాదుల దృష్టిని ఆకర్షించింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ నెల 8న హెచ్ఐసీసీలో అట్టహాసంగా ప్రారంభమైన ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం’ వేడుకలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. మహాత్మాగాంధీ సహా, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న సమరయోధుల త్యాగాలను నేటి తరానికి అర్థమయ్యేలా రెండు వారాలపాటు నిర్వహించిన వేడుకల్లో పెద్దఎత్తున ప్రజలు భాగస్వాములయ్యారు. మహాత్మా గాంధీపై రూపొందించిన చలన చిత్రాన్ని రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పిల్లలకు ఉచితంగా ప్రదర్శించటం ఉత్సవాలకు హైలైట్గా నిలిచింది. దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు గాంధీ సినిమాను చూడటం దేశంలోనే తొలిసారి. పలు రాష్ట్రాల అధికారులు గాంధీ చిత్ర ప్రదర్శన వివరాలు అడిగి తెలుసుకోవటం గమనార్హం.