Krishna Vamsi OTT Entry | తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తెలుగు సినిమాల ఖ్యాతిని పెంచిన దర్శకులలో కృష్ణవంశీ ఒకడు. అప్పట్లో ఈయన సినిమా విడుదలవుతుందంటే టిక్కెట్ల కోసం ప్రేక్షకులు తెల్లవారుజాము నుండి లైన్ కట్టేవారు. అంతలా కృష్ణవంశీ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకునేవి. ఇక ఫ్యామిలీ ఆడియోన్స్లో ఈయన క్రేజ్ మాములుగా ఉండేది కాదు. కృష్ణవంశీ కూడా ఒకే జానర్లో సినిమాలు చేయకుండా ప్రతి సినిమాకు వేరియేషన్ చూపిస్తుంటాడు. ‘గులాబి’తో కెరీర్ను ప్రారంభించిన కృష్ణవంశీ మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత ‘నిన్నే పెళ్ళాడతా’తో నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో ‘సింధూరం’, ‘అంతఃపురం వంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్గా నిలిచాడు.
అయితే గత కొంత కాలంగా ఈయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా రాణించడంలేదు. 2002లో వచ్చిన ‘ఖడ్గం’ తర్వాత ఇప్పటివరకు కృష్ణవంశీకి ఆ స్థాయి హిట్టు పడలేదు. ఆ తర్వాత వచ్చిన ‘చందమామ’, ‘మహాత్మ’ బాగానే ఆడినా బ్లాక్బస్టర్ విజయాలు సాధించలేకపోయాయి. ప్రస్తుతం ఈయన ‘రంగమార్తండ’ సినిమాను రూపొందిస్తున్నాడు. గతంలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈ సినిమా మరాఠి క్లాసిక్ ‘నట్సామ్రాట్’ చిత్రానికి రీమేక్గా తెరకెక్కింది. ఈ చిత్రం తర్వాత ‘అన్నం’ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు గతేడాది మహాశివరాత్రి సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా కృష్ణవంశీ ఓటీటీ ఎంట్రీకి సిద్దమవుతున్నట్లు తెలిపాడు. లేటెస్ట్గా జరిగిన ఇంటర్వూలో కృష్ణవంశీ ఓటీటీ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. అన్ని కుదిరితే వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ను స్టార్ చేయనున్నట్లు, దాదాపు రూ.200 నుండి రూ.300 కోట్ల బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ సిద్ధమయ్యే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించాడు. మనం ఏది తీయాలనుకుంటే అది తీసే స్వేచ్ఛ ఓటీటీలో ఉందని, నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం కూడా ఉండదు అని ఇంటర్వూలో చెప్పుకొచ్చాడు.