రామ్ చరణ్ ప్రస్తుతం వరస సినిమాలు చేస్తున్నాడు. చిరంజీవి హీరోగా వస్తున్న ఆచార్యలో కీలక పాత్ర చేస్తున్నాడు మెగా పవర్ స్టార్. ఈ చిత్రంలో అరగంట పాటు ఉండే అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఖమ్మం జిల్లా ఇల్లెందులో జరుగుతుంది. అక్కడ బొగ్గు గనుల ప్రాంతంలో ఆచార్య షూటింగ్ జరుగుతుంది. మార్చ్ 15 వరకు అక్కడే కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. వీటిలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా ఉండాల్సిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటాడేమో అనుకున్నారు కానీ అలాంటిదేం జరిగేలా కనిపించడం లేదు.
ఆచార్య నుంచి అలా ఫ్రీ అవ్వగానే రాజమౌళి లాక్ చేస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో హాలీవుడ్ సాంకేతిక నిపుణుల సాయంతో అత్యద్భుతమైన క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతుంది. ఆచార్య కోసం ఇందులోంచి కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాడు చరణ్. అక్కడ పూర్తవ్వగానే వచ్చి జాయిన్ అవుతానని రాజమౌళికి మాటిచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారమే ఆచార్య తర్వాత ఏ మాత్రం బ్రేకులు లేకుండా ఇక్కడికి రానున్నాడు చరణ్. మార్చ్ 15 తర్వాత ట్రిపుల్ ఆర్ తో బిజీ కానున్నాడు మెగా వారసుడు.
కనీసం రెండు మూడు రోజులు బ్రేక్ కూడా లేకుండా ట్రిపుల్ ఆర్ లో జాయిన్ కానున్నాడు. కొన్ని రోజుల పాటు నో రెస్ట్ అంటున్నాడు మెగా హీరో. వచ్చే వారం రామ్ చరణ్, అలియా భట్ పై ఓ రొమాంటిక్ పాటను చిత్రీకరించనున్నాడు రాజమౌళి. దీనికోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. ఓ భారీ సెట్ కూడా నిర్మిస్తున్నారు. ఈ ఒక్క పాట కోసమే 3 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. వారం రోజులకు పైగానే ఈ పాట చిత్రీకరణ జరగనుంది. ఏదేమైనా కూడా అక్కడా.. ఇక్కడా అంటూ ఫుల్ బిజీగా రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్నాడు రామ్ చరణ్.