నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న సోయిలేని, ప్రభుత్వం కల్పించిన అవకాశాలను ప్రజల వద్దకు చేర్చే చేవలేని ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో ఇప్పుడు మునుగోడు కీలక మలుపు వద్ద నిలబడింది. అభివృద్ధిని పరుగులు పెట్టించే టీఆర్ఎస్ అభ్యర్థిని ఎన్నుకునేందుకు సిద్ధమంటూ ప్రతినబూనుతున్నది. గెలిచిన నియోజకవర్గానికి చెప్పుకోవడానికి చేసిందేమీ లేని స్థితిలో విపక్షం ఉంటే.. మునుగోడుకు స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమిటో.. చేస్తున్నదేమిటో చెప్పేందుకు, ఇంకా చేయబోయే అభివృద్ధిని వివరించేందుకు స్వయానా ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వస్తుండటంతో నిండుమనసుతో దీవించేందుకు సిద్ధమవుతున్నది. విపక్షాల సభలకంటే ముందుగానే శనివారం నిర్వహించే ‘ప్రజాదీవెన’ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా మునుగోడు నియోజక వర్గంలోని చౌటుప్పల్ రోడ్డులో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే ప్రజాదీవెన సభ.. తెలంగాణ రాజకీయాలకు, రాబోయే ఎన్నికలకు, మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి ఒక మేలిమలుపు కానున్నదా? అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వినవస్తున్నది.
అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందే క్షేత్రస్థాయిలో ఎవరి బలం.. స్థాయి.. స్థానం ఏమిటో కూడా మునుగోడు ఉపఎన్నిక స్పష్టం చేయనున్నదనే చర్చ సర్వత్రా సాగుతున్నది. ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించి అధికారం ఇస్తే, కుంటిసాకులు చెప్తూ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాలయాపన చేశారన్న అభిప్రాయాలు నియోజవకర్గ ప్రజల్లో బలంగా ఉన్నాయి. మునుగోడు అభివృద్ధి గురించి ఇప్పటిదాకా ఏ మాత్రం ఆలోచించని వ్యక్తి ఒక్కసారిగా ఉపఎన్నిక వస్తే అభివృద్ధి జరుగుతుందంటూ తిరకా సు ప్రచారం మొదలుపెట్టారు. ఏదో త్యాగం చేస్తున్నట్టు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా రు.
ఆయన తపన నిజంగా అభివృద్ధి గురించే అయితే.. తనకు రాజకీయ నీడనిచ్చిన కాంగ్రెస్ నుంచే ఎందుకు పోటీకి దిగడం లేదన్న ప్రశ్న అప్పుడే తలెత్తింది. ఆయన బీజేపీలో చేరి ఉప ఎన్నిక బరిలో నిలవడంతో ఇదంతా అభివృద్ధి రాజకీయం కాదని, ఫక్తు కాంట్రాక్టులు, వ్యాపార రాజకీయమని అందరికీ అర్థమైపోయింది. అవకాశం దొరికినప్పుడల్లా ప్రజాస్వామ్యాన్ని హతమార్చేందుకు సిద్ధపడే బీజేపీ.. తెలంగాణలో ఒక ప్రయోగం కోసం రాజగోపాల్రెడ్డిని పావుగా ఎంచుకున్నదన్న విషయమూ తేటతెల్లమైపోయింది. ఉప ఎన్నికలో తాను గెలిచే పరిస్థితి లేకున్నా.. మునుగోడులో టీఆర్ఎస్ను ఓడించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో అధికారం చేపడుతామని బీజేపీ ప్రగల్భాలు పలుకుతున్నది. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు కూడా ఈ నెల 21న మునుగోడులో బహిరంగ సభకు సిద్ధమయ్యారు.
ఎన్నికల సమయాల్లో విపక్షాలు సభలు పెట్టి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటాయి. వాటికి సమాధానంగా అధికార పక్షాలు సభలు పెడుతుంటాయి. కానీ మునుగోడులో ఇందుకు భిన్నంగా అధికార టీఆర్ఎస్ ఓ సాహసమే చేస్తున్నది. విపక్ష సభకు ఒక్కరోజు ముందుగానే సభకు సిద్ధపడటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అందులోనూ ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లను, అడ్డంకులను అధిగమించి, తనదైన వ్యూహంతో తెలంగాణ రాష్ర్టాన్నే సాధించి, ఇవ్వాళ దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతున్న టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ముందుగానే సభను పెట్టడం బీజేపీలో గుబులు రేపుతున్నది.
సమైక్య పాలనలో మునుగోడు దుస్థితిని స్వయంగా చూసి చలించిపోయిన కేసీఆర్.. స్వరాష్ట్రంలో ఏం చేస్తానో ఆనాడే చెప్పారు. చెప్పిన విధంగా చేసి చూపుతున్న సీఎం కేసీఆర్, శనివారం ప్రజాదీవెన సభలో మునుగోడు కోసం ఏమేమి చేశామో స్పష్టం చేయనున్నారు. 60 ఏండ్లలో ఫ్లోరైడ్ను పెంచి పోషించిన కాంగ్రెస్, బీజేపీ పాలకులకు చెంప ఛెళ్లుమనిపించేలా ఆరేండ్లలోనే ఫ్లోరైడ్ రక్కసిపై పైచే యి సాధించారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి గడపకూ సురక్షిత తాగునీటిని అందిస్తున్న ఘన త సీఎం కేసీఆర్దే. మిషన్ భగీరథతో కొత్తగా ఒక్క ఫ్లోరైడ్ కేసూ నమోదు కాలేదని పార్లమెంట్ సాక్షిగా పలు సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది.
దీనికితోడు శాశ్వత నివారణ చర్యల్లో భాగంగా కరువు పీడిత ప్రాంతమైన మునుగోడుకు సాగునీటి కల్పనపైనా దృష్టి సారించారు. డిండి ఎత్తిపోతల పథకం ద్వారా మునుగోడు నియోజకవర్గంలోని 2.55 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా ప్రాజెక్టును డిజైన్చేశారు. చర్లగూడెం, కిష్టరాంపల్లి రిజర్వాయర్ల నిర్మాణాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఇవి పూర్తయితే మునుగోడు గోడుకు శాశ్వత పరిష్కారం లభించనున్నది. వీటి నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్న క్రమంలో ఎమ్మెల్యే అయిన రాజగోపాల్రెడ్డి వివిధ రూపాల్లో వీటిని అడ్డుకొనేందుకు ప్రయత్నించారే తప్ప.. ఈ ప్రాజెక్టును వేగంగా ఎలా పూర్తి చేయాలనే ఆలోచన గానీ, దీని కోసం ఏనాడూ ప్రభుత్వ పెద్దలను కలిసింది గానీ లేదు. ఇక రహదారులు, గ్రామాల్లో మౌలిక వసతులు ఇలా అనేక రంగాల్లో మునుగోడు ప్రగతిపథంలో సాగుతున్నది.
ఇలా మునుగోడు కోసం ఏం చేశామో స్పష్టం చేయడం కోసమే అందరికంటే ముందే మునుగోడు ప్రజాదీవెన సభకు సీఎం కేసీఆర్ సిద్ధపడ్డారు. ప్రత్యేకించి మునుగోడుకు అన్ని రకాలుగా ప్రభుత్వం, టీఆర్ఎస్ అండగా ఉంటాయనే విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించనున్నారు. ‘ఎమ్మెల్యే రాజీనామా చేసినంత మాత్రాన అభివృద్ధి ఆగదు. గడప గడపకూ సంక్షేమం చేర్చడమే ప్రభుత్వ కర్తవ్యం. అందుకు నాదే బాధ్యత. ఎవరూ దిగులు చెందాల్సిన అవసరం లేదు’ అనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చి మునుగోడు ప్రజలకు కేసీఆర్ భరోసా ఇవ్వనున్నారు.
మునుగోడు ప్రజలు సైతం సీఎం కేసీఆర్ రాకకోసం ఆశగా.. ఆసక్తిగా ఎదురుచూస్తున్నా రు. రాజగోపాల్రెడ్డి స్వార్థ రాజకీయాల కోసమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని మునుగోడు నియోజకవర్గం ఆగ్రహంతో రగిలిపోతున్నది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించుకోవడం ద్వారా నియోజకవర్గం అభివృద్ధికి నోచుకున్నదని స్థానికులు చెప్తున్నారు. 2018లో రాజగోపాల్రెడ్డి మాయ వేషాలతో తాము మోసపోయామని ఆవేదన చెందుతున్నారు.
రాజగోపాల్ తన వ్యాపార సామ్రాజ్యా న్ని విస్తరించుకొనేందుకే రాజీనామా చేశారని ఆగ్రహంతో ఉన్న ప్రజలు.. ఆయనకు తగిన బుద్ధిచెప్పేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు మంత్రి జగదీశ్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్, పార్టీ జిల్లా ఇన్చార్జి తక్కళ్లపల్లి రవీందర్రావు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు సహా అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు మునుగోడు నియోజకవర్గంలోని ప్రజలను కలిసి వారిలో భరోసా నింపుతున్నారు. ఫలితంగా టీఆర్ఎస్లో చేరికలు వెల్లువలా సాగుతున్నాయి.
మునుగోడులో జరిగే ప్రజా దీవెన సభకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రోడ్డు మార్గంలో వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ వైపు వచ్చే వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని నల్లగొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి సూచించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4 గంటల వరకు 65వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా సహకరించాలని విజ్ఞప్తిచేశారు.