సీఎం కేసీఆర్ దూరదృష్టి ,అకుంఠిత దీక్ష వలన హైదరాబాద్ నగరం నేడు దేశానికి ఐటీ హబ్ గా ప్రపంచ స్థాయి సంస్థల గమ్యస్థానంగా మారుతున్నది.అమెజాన్, గూగుల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలకు, ఐటీ నిపుణులకు నేడు హైదరాబాద్ విశ్వవేదికగా మారింది. ఇటీవల నీతి ఆయోగ్ ప్రకటించిన ఇన్నోవేషన్ ఇండెక్స్లో అద్భుత పనితీరు(పెర్ఫార్మెన్స్)లో ప్రథమ స్థానం, సాధించిన స్థాయి సూచికలో నాలుగో స్థానంతో మొత్తంగా భారత ఆవిష్కరణ సూచిలో తెలంగాణ ద్వితీయ స్థానంతో అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
దేశంలో నవ కల్పనలు నూతన ఆవిష్కరణలతో వివిధ రాష్ర్టాల పనితీరును నీతి ఆయోగ్ ప్రకటించింది. దీనికోసం నైపుణ్య ఆధారిత ఉపాధి, అంకుర పరిశ్రమలో ప్రోత్సహక మార్గాలు, తగిన పెట్టుబడులు నైపుణ్య శిక్షణ సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమల అభివృద్ధి (MSME) మొదలైన అంశాలను ప్రతిపాదికగా తీసుకుంది. తద్వారా సమగ్ర విధానాన్ని జాతీయ స్థాయిలో రూపకల్పన చేయడానికి ఇనిస్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్నెస్ (IFC) సహకారంతో నీతిఆయోగ్ పర్ఫార్మెన్స్, ఎనేబులర్స్ అనే రెండు సూచికల్లో ఏడు అంశాల ద్వారా 66 సూచికల ద్వారా ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంకులను ఇటీవల ప్రకటించింది. మూడు కేటగిరీలో ప్రకటించిన ఈ ర్యాంకులలో పెద్ద రాష్ర్టాల కేటగిరిలో కర్ణాటక 18.01 స్కోరుతో మొదటి స్థానం సాధించగా తెలంగాణ రాష్ట్రం 17.66 స్కోరుతో రెండవ స్థానంలో నిలిచింది. మానవ వనరులు, పెట్టుబడులు, నైపుణ్య కార్మికులు, వాణిజ్య వాతావరణం, భద్రత న్యాయపరమైన వాతావరణం, విజ్ఞాన వ్యాప్తి, విజ్ఞాన ఉత్పాదనలు మొదలైన ప్రామాణికాలలో తెలంగాణ అద్భుతమైన స్కోరును సాధించి నవ కల్పనలలో నూతన ఆవిష్కరణలలో దేశానికి దిక్సూచిగా నిలిచింది.
భారత ఆవిష్కరణ సూచీలోని అనేక అంశాలలో తెలంగాణ రాష్ట్రం గతంలో కంటే రెట్టింపు మెరుగైనది. ఐసీటీ (information and communication technology) ల్యాబ్ లా వినియోగంలో 17 శాతం నుండి 35 శాతంకు వృద్ధి సాధించింది. అలాగే ఒక లక్ష జనాభాపరంగా, ఉన్నత విద్యార్థుల నమోదులో 9.7 నుండి 15.7 శాతానికి ఎగ ప్రాకింది. పరిశోధన, అభివృద్ధి యూనిట్లలో 0.3 నుండి 1.4 కు పెరిగినది. రాష్ట్రంలో అంకుర పరిశ్రమల (స్టార్టప్ లు) సంఖ్య 4900 నుండి 9000 పెరుగుతూ పురోగమనంలో సాగుతుంది. ప్రభుత్వ సానుకూల విధానాలతో ఐటీ రంగంలో హైదరాబాద్ నగరం మరో సిలికాన్ వ్యాలీగా నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధిలో ఆవిష్కరణలు మౌలిక వసతులు సమగ్ర అభివృద్ధి (III-innovation infrastructure inclusive growth)అనే త్రీ ఐ మంత్రాన్ని జపిస్తూ గత ఎనిమిదేండ్లలో ప్రత్యక్షంగా పరోక్షంగా 16 లక్షల మందికి ఉపాధి కల్పించింది. ఐటీ రంగంలో ఎగుమతులు 2014లో 57 వేల కోట్లు ఉంటే ప్రస్తుతం రు.1.50 లక్షల కోట్లకు పెరిగాయి. సింగిల్ విండో పద్ధతిలో టీఎస్ ఐపాస్తో దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలు తెలంగాణలో వందలాది కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు నెలకొల్పుతున్నారు. అలాగే హైదరాబాదు నగరంలో నలుదిశలా అభివృద్ధి చెందేందుకు గ్రోత్ ఇన్ డిస్పర్షన్(గ్రిడ్) పాలసీకి శ్రీకారం చుట్టి పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నది.
నగరంలోని 11 పారిశ్రామిక వాడలను ఐటీ పార్కులుగా మార్చడం, కండ్లకోయలో 10.11 ఎకరాల విస్తీర్ణంలో గేట్ వే ఐటీ పార్క్ పేరుతో రెండు భారీ ఐటీ టవర్ల నిర్మాణం జరుపుతున్నది. ఐటీ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఐటీ రంగ అభివృద్ధికి కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు తన శాఖ ఆధ్వర్యంలో చేపడుతూ ఆవిష్కరణలకు ఊతమిస్తున్నారు. తెలంగాణ ఐటీ రంగంలో భవిష్యత్తులో ఏ రాష్ర్టానికి అందనంత ఎత్తులో బలమైన ఆర్థిక శక్తిగా నిలవగలదు.