హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలు (మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్)కు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. భార్యాభర్తల (స్పౌజ్) కోటాలో బదిలీలకు కూడా అంగీకరించినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫైల్పై సీఎస్ సోమేశ్కుమార్ సంతకం చేయగా, రేపోమాపో ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొన్నారు. రాష్ట్రంలో జిల్లా, జోనల్, మల్టీజోనల్ ఉద్యోగుల కేటాయింపులు ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దంపతులైన ఉద్యోగుల్లో కొందరు వేర్వేరు చోట్ల పనిచేస్తున్నారు. కొందరు స్వస్థలాలకు దూరమయ్యారు. దీంతో బుధవారం పరస్పర, స్పౌజ్కోటా బదిలీలు, అప్పీళ్లను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్ సోమేశ్కుమార్ కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. టీఎన్జీవో, టీజీవో నేతల అభ్యర్థన మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పరస్పర బదిలీలు, సౌజ్ కోటా బదిలీలు, అప్పీళ్ల పరిష్కారానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారని ఉద్యోగనేతలు చెప్పారు. దీంతోపాటు అప్పీళ్లను కూడా పరిష్కరించాలని నిర్ణయించిందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు. దీంతో స్పౌజ్కోటాలో 5,130 మంది, పరస్పర బదిలీల ద్వారా 25 వేల మంది, అప్పీళ్ల పరిష్కారం ద్వారా మరికొంత మందిని బదిలీచేసే ఆస్కారమున్నది. అప్పీళ్లల్లో సక్రమంగా ఉన్నవాటిని పరిగణనలోకి తీసుకోనున్నారు. గతంలో పరస్పర బదిలీలు, స్పౌజ్కోటా బదిలీలను స్పెషల్ క్యాటగిరీ కింద మాత్రమే పరిగణనలోకి తీసుకొనేవారు. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోలను జారీచేయాల్సి వచ్చేది. సాధారణ బదిలీల్లో మాత్రం స్పౌజ్ కోటా బదిలీలకు అవకాశం కల్పించేవారు. కానీ ఇప్పుడు ఒకే దఫాలో 30 వేల మంది ఉద్యోగులు, టీచర్లను తాము కోరుకొన్న చోటికి బదిలీ చేయనున్నారు. దీని ద్వారా ఎంప్లాయ్ ఫ్రెండ్లీ విధానాల్లో తెలంగాణ తనకే తానే సాటి అని నిరూపించుకొన్నది. గతంలో చివరిసారిగా 2010-11లో పరస్పర బదిలీలకు అవకాశం కల్పించారు. దశాబ్దకాలం తర్వాత మళ్లీ స్వరాష్ట్రం తెలంగాణలోనే ఉద్యోగులు పరస్పర బదిలీల ద్వారా ఉద్యోగులు, ఉపాధ్యాయులు లబ్ధి పొందబోతున్నారు. ఇక స్పౌజ్ కోటా తీసుకొంటే 2015, 2018 సంవత్సరాల్లో రెండు సార్లు బదిలీలకు అవకాశం కల్పించారు. మూడేండ్ల తర్వాత ఈ కోటాలో బదిలీలు చేయనున్నారు. కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపు సమయంలో జీవో -317లో భాగంగా స్పౌజ్ కోటాలో 1,586 మంది టీచర్లను బదిలీచేశారు. అయినా మిగతా శాఖల్లోను విజ్ఞప్తులు రావడంతో తాజాగా అవకాశం కల్పించారు. ఈ బదిలీలు 19 జిల్లాలకు మాత్రమే జరిగే అవకాశమున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఆయా జిల్లాల్లో భర్తీ కోసం కొన్ని పోస్టులను ఖాళీగా ఉంచాల్సి రావటంతో కొన్ని జిల్లాలకు బదిలీలు చేసే అవకాశమున్నట్టుగా అధికారులంటున్నారు. టీచర్ల పరస్పర బదిలీల్లో భాగంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పరిగణనలోకి తీసుకోనున్నట్టుగా తెలుస్తున్నది. ఉదాహరణకు ఒక స్కూల్ అసిస్టెంట్ (జీవశాస్త్రం) టీచర్ బదిలీ కోరుకొంటే, మరో జిల్లా నుంచి సైతం స్కూల్ అసిస్టెంట్ (జీవశాస్త్రం) టీచర్ అంగీకారం తెలపాలి.
ప్రభుత్వ నిర్ణయంపై టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయికంటి ప్రతాప్, టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీ మమత, ఏ సత్యనారాయణ, పీఆర్టీయూ టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగా రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్కుమార్ ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు.
పోస్టింగ్స్ ప్రకారం రిపోర్ట్ చేయని, విధుల్లో చేరని ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్కారు భావిస్తున్నది. ఇప్పటివరకు 13,760 జిల్లా క్యాడర్, 22 వేల పైచిలుకు టీచర్లు రిపోర్ట్చేశారు. కొంత మంది రిపోర్ట్ చేయలేదు. వీరిలో పంచాయితీరాజ్ విభాగం నుంచే అత్యధికంగా ఉన్నట్టు తెలుస్తున్నది. కొంతమంది కేటాయించిన పోస్టుల్లో చేరబోమని లేఖలు రాసిచ్చారు. ఈ నేపథ్యంలో వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొనేందుకు సిద్ధమవుతున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఉద్యోగుల జోనల్ విభజనలో పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) ప్రభుత్వాన్ని కోరింది. ఆలుమగల కేసులు, అప్పీళ్లను త్వరగా పరిష్కరించాలని టీఎన్జీవో కేంద్రం సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్, కోశాధికారి రామినేని శ్రీనివాస్రావు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ముజీబ్ హుస్సేని, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్కుమార్తో కూడిన బృందం బుధవారం బీఆర్కే భవన్లో సీఎస్ సోమేష్కుమార్కు వినతిపత్రాన్ని సమర్పించింది.