ఇటీవల ఐఏఎస్ మరియు ఐపిఎస్ అధికారులను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు వ్యాఖ్యలు సరికావని, ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో ఉద్యోగులు నిబద్ధతతో పని చేస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్, ఇతర నేతలు అన్నారు. గోనె ప్రకాశరావు ప్రధానంగా ఓ మహిళా కలెక్టర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తరుపున ఇలాంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలు పై విధంగా స్పందించారు. ప్రభుత్వ యంత్రాంగంపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఉద్యోగులు, అధికారుల మనోస్థైర్యం దెబ్బతింటుందని, దీనిపై కలెక్టర్ను వివరణ అడిగితే సమాధానం వచ్చేదని అన్నారు.
ప్రభుత్వంలో సంక్షేమ పథకాలను అర్హులకు చేర్చే బాధ్యత అధికారులు, ఉద్యోగులదేనని, రాజకీయ నేతలు, యంత్రాంగం సమన్వయంతో ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తారని, ఒక పార్టీ నేతలు మరో పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేయడం సాధారణమే కానీ ఒక కలెక్టర్పై.. అది కూడా మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సీనియర్ నేత గోనె ప్రకాశరావుకు తగదని వారు హితవుపలికారు. ఆదిలాబాద్, రంగారెడ్డి కలెక్టర్లపై అదే విధంగా ఐపీఎస్ అధికారుల పై ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్, సెక్రెటరీ జనరల్ మమత, ఇతర నేతలు డిమాండ్ చేశారు.