చెన్నై ,జూలై :పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో వాహనదారులు ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన 33ఏండ్ల భాస్కరన్ కేవలం రూ.20,000 ఖర్చుతో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ను తయారు చేశాడు. భాస్కరన్ ఈ ప్రయోగంలో భాగంగా మార్కెట్లో దొరికే ఎలక్ట్రిక్ మోటార్ బ్యాటరీ తోపాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి ఈ సైకిల్ను ఈ-బైక్గా మార్చేశాడు. మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమాచేసిన భాస్కరన్ టాలెంట్ తో ఈ-సైకిల్ను రూపొందించాడు.
గతేడాది కరోనా మహమ్మారి కారణంగా భాస్కరన్ జాబ్ కోల్పోయాడు. ఉద్యోగం పోయినా తాను మాత్రం కుంగిపోకుండా వ్యవసాయంపై దృష్టి సారించాడు. తన ఖాళీ సమయంలో ఊరికే కూర్చోకుండా ఈ ఎలక్ట్రిక్ బైక్ పై ప్రయోగాలు చేయటం ప్రారంభించాడు. భాస్కరన్ ఇప్పుడు తన పొలం పనులకు ఈ-సైకిల్ మీదనే వెళ్తున్నాడు. ప్రస్తుతం ఇలాంటి ఎలక్ట్రిక్ సైకిళ్లను బయటి మార్కెట్లో కొనుగోలు చేయాలంటే సుమారు రూ.30,000 నుంచి రూ.1 లక్ష వరకూ ఖర్చవుతుంది.
అలాంటిది కేవలం రూ.20,000 బడ్జెట్తోనే భాస్కరన్ ఎలక్ట్రిక్ బైక్ ను రూపొందించాడు. రూ.2,000 ఒక పాత సైకిల్ను కొనుగోలు చేసి, మిగిలిన 18,000 లతో బ్యాటరీ, చార్జర్ , ఎలక్ట్రిక్ సైకిల్ తయారీకి కావల్సిన విడిభాగాలను కొనుగోలు చేశాడు. భాస్కరన్ తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ఇప్పుడు అతని ఊరిలో టాక్ ఆఫ్ ది విలేజ్గా మారింది. ఇందులో ఎలక్ట్రిక్ మోటారు, బ్యాటరీ కంట్రోలర్, బ్రేక్ కట్-ఆఫ్ స్విచ్ అమర్చినట్లు భాస్కరన్ తెలిపాడు. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక యూనిట్ కరెంట్ కు 50కిలోమీటర్ల వరకువస్తుంది. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది.