తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గురువారం శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన టికెట్లను ఈ నెల 20న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించిన టికెట్లను ఒకేసారి బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుండగా.. టికెట్లు బుక్ చేసుకునేందుకు మూడు రోజుల పాటు గడువు ఇచ్చింది.
ఆన్లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో టికెట్లను కేటాయించనుండగా.. ఈ నెల 22న టికెట్లు పొందిన భక్తుల వివరాలను పంపనున్నది. సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజపాద దర్శనం సేవలకు సంబందిచిన టికెట్లు విడుదల చేయనున్నది. కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020 మార్చిలో ఆయా సేవలను దేవస్థానం నిలిపివేసింది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో భక్తుల కోరిక మేరకు సేవలను పునరుద్ధరిస్తున్నది.