TTD | వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, శ్రావణ మాసం కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య పెరిగిపోతున్నది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. దీంతో భక్తులు శ్రీవారి దర్శనానికి కట్టిన క్యూ లైన్లు ఔటర్ రింగ్ రోడ్డును తాకాయి. ఏటీసీ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. క్యూ లైన్లలో భక్తులు భారీగా ఉండటంతో తొక్కిసలాట జరక్కుండా టీటీడీ తగు చర్యలు చేపట్టింది.
శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులను టీటీడీ అధికారులు బృందాలుగా విభజించి పంపుతున్నారు. టీటీడీ జాయింట్ ఈవో వీరబ్రహ్మం ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని పర్యవేక్షిస్తున్నారు. ఇక క్యూ లైన్లలో ఉన్న భక్తులకు ఫుడ్, పాలు, తాగునీరు సరఫరా చేస్తున్నారు.
ప్రధాన అన్న ప్రసాద సమయంలో సుమారు 50 వేల మందికి, వైకుంఠం క్యూ లైన్ కంపార్ట్మెంట్లు, క్యూలైన్లలో 1.30 లక్షల మందికి అన్న ప్రసాదం, ఉప్మా, పొంగల్ పంపిణీ చేశామని టీటీడీ అధికారులు చెప్పారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకే సుమారు 60 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
భారీగా రద్దీ ఉన్నందున చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్న భక్తులు టీటీడీ యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ చేసిన విజ్ఞప్తిని ఎవరూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్, పోలీసు సిబ్బంది.. క్యూ లైన్లలో తొక్కిసలాట జరక్కుండా బందోబస్తు చేపట్టారు. దక్షిణాది రాష్ట్రాలతోపాటు జార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వచ్చారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు క్యూ లైన్ల వద్ద పరిస్థితిని పరిశీలిస్తున్నారు.