స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ.. వజ్రోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నాటి పోరాట యోధులను, వారి త్యాగాలను స్మరించుకుంటూనే, నేటి యువతలో దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ఆగస్టు 8 నుంచి 22 వరకు.. 15 రోజుల పాటు దేశభక్తి ఉట్టిపడేలా వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు రూపకల్పన చేసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో వజ్రోత్సవాలను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రతి ఇంటిపైనా జాతీయ జెండాను ఎగురవేసేలా చర్యలు తీసుకుంటున్నది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ వజ్రోత్సవాల్లో భాగస్వాములు చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వివిధ అంశాలపై విద్యార్థులకు పోటీలు నిర్వహించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. గ్రామాలు, పట్టణాల్లో ర్యాలీల నిర్వహణతో పాటు స్వాతంత్య్ర పోరాటంలో అమరులైన వారికి నివాళులు అర్పించడం వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
నిజామాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బ్రిటీష్ బానిసత్వం నుంచి విముక్తి పొంది 75 సంవత్సరాలు కావొస్తున్న శుభవేళ ఇంటింటా త్రివర్ణం రెపరెపలాడాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి నేటి తరానికి తెలిసేలా స్వాతంత్య్ర వజ్రోత్సవాలను చిరస్మరణీయమైన రీతిలో అంగరంగ వైభవంగా జరుపనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఈసారి ఆగస్టు 15 వేడుకలను వైభవోపేతంగా నిర్వహించేందుకు సిద్ధమైంది.
పక్షం రోజుల పాటు అట్టహాసంగా జరిపేందుకు యంత్రాంగం సిద్ధమైంది. స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయుల త్యాగాలు, వారి పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా, దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా కార్యక్రమాలు రూపొందించారు. వాడవాడలా, గడపగడపనా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని నిర్ణయించారు. క్రీడా, వ్యాసరచన, వక్తృత్వ, కవి సమ్మేళనాలు, జాతీయ భావాలను పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఆగస్టు 15కు ముందు 7 రోజులు, తర్వాత 7రోజులు మొత్తంగా 15 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
దేశభక్తి ద్విగుణీకృతమయ్యేలా ప్రణాళికలు
ఉత్సవాల నిర్వహణపై ఎంపీ కే కేశవరావు నేతృత్వంలోని కమిటీ పలు మార్గదర్శకాలను సైతం విడుదల చేయగా వాటి ప్రకారం యంత్రాంగం పని చేస్తున్నది. అటు దేశ వ్యాప్తంగా ఇటు తెలంగాణలో దేశ స్వాతంత్య్రం కోసం సాగిన పోరాటాలు, జరిగిన త్యాగాలు, నాటి జాతీయ నాయకులు, అమరుల వివరాలు నేటి తరానికి అర్థమయ్యేలా పోటీలను నిర్వహించనున్నారు. 75 ఏండ్ల కాలంలో భారతదేశం ఎన్నో మరుపురాని విజయాలను సొంతం చేసుకున్నది. ఆగస్టు 8 నుంచి 22 వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 15 రోజులు దేశ భక్తి ఉట్టిపడేలా కార్యక్రమాలు ఉంటాయి. 8న హెచ్ఐసీసీలో సీఎం కేసీఆర్ వజ్రోత్సవాలను ప్రారంభిస్తారు. 22న ఎల్బీ స్టేడియంలో ముగింపు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఆగస్టు 15న ఇంటింటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములుగా ఉంటారు. స్వాతంత్య్ర పోరాటం, సమరయోధులు, జాతీయ నాయకుల చిత్రాలతో హోర్డింగ్లు, బిల్ బోర్డుల ప్రదర్శన, ఎలక్ట్రానిక్ డిస్ప్లేలు, విద్యుద్దీపాలంకరణ చేస్తారు. పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, పాటలు, నాటికలు, ఫ్యాన్సీ డ్రెస్ల పోటీలు, ప్రదర్శనలు, ర్యాలీలు, జానపద పాటలు, నృత్యాలు ఉంటాయి.
గ్రామం, పట్టణం, నగరాల్లో ర్యాలీలు..
గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఆయా మైదానాల్లో మూడు రంగుల బెలూన్లను ఎగురవేస్తారు. ఏదైనా ఒక రోజు ప్రధాన కూడళ్ల వద్ద జాతీయ గీతాలాపన, స్వాతంత్య్ర సైకిల్ ర్యాలీలు తలపెడతారు. అమరులైన వారి కోసం దీపాలను వెలిగించి వారికి కృతజ్ఞతలు సైతం తెలియజేసేలా కార్యక్రమాలను రూపొందించారు. ఈ ఉత్సవాల సమయంలోనే రక్షాబంధన్ వస్తుండడంతో సమైక్యతా భావాన్ని తెలిపేలా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కాలనీల శుభ్రత, కవి సమ్మేళనం, ముషాయిరాలను నిర్వహిస్తారు. మహిళలతో రంగోళి, పుస్తక ప్రదర్శన, వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, ఖో-ఖో, ఇతర క్రీడల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేస్తారు. ఆగస్టు 22న జరిగే ముగింపు కార్యక్రమానికి వలంటీర్లతో ప్రతి జిల్లా నుంచి వేయి నుంచి 2వేల మందితో ర్యాలీగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియానికి పయనమవుతారు. ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, స్వయం సహాయక మహిళా బృందాలు, పాఠశాలలు, కళాశాలలు, క్రీడా క్లబ్బులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తారు. చలన చిత్రోత్సవ నిర్వహణ, సినిమా హాళ్లు, పాఠశాలలు, కళాశాలల్లో దేశభక్తి చిత్రాల ప్రదర్శన ఉంటుంది. జాతీయ జెండాలతో భారీ ఎత్తున నగరాలు, పట్టణాల్లో ర్యాలీలు నిర్వహిస్తారు.
పండుగ వాతావరణంలో..
భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. దేశభక్తి ప్రతి ఒక్కరినీ స్పృశించే విధంగా కార్యక్రమాల సరళిని రూపొందించింది. ఇందులో గ్రామస్థాయి నుంచి నగరాల వరకు పదిహేను రోజులు సందడి వాతావరణంలో త్రివర్ణ పతాకంతో కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధమైంది. ప్రజాప్రతినిధులను ఇందులో కీలక భూమిక పోషించేలా ఆదేశాలు సైతం జారీ అయ్యాయి. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలతోపాటు ఎంపీపీ, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇందులో ప్రధాన పాత్ర వహించేలా ప్రభుత్వం మార్గదర్శకాలిచ్చింది. ప్రజలతో మమేకమై స్వాతంత్య్ర వజ్రోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే పేర్కొన్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో 1056 గ్రామ పంచాయతీలు, 51 మండల కేంద్రాలు, 6 పురపాలక సంఘాలు, ఒక నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జోరుగా నిర్వహించనున్నారు.
ఇది ప్రజల పండుగ..
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకోవడం ప్రజలందరికీ పండుగ లాంటిది. ఈ వజ్రోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయబోయే మార్గదర్శకాల మేరకు ఘనంగా నిర్వహిస్తాం. ఈ వేడుకల్లో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం.
– సి.నారాయణ రెడ్డి, కలెక్టర్, నిజామాబాద్