పాట్నా, జూలై 18: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధతపై ఇచ్చిన హామీని అమలు చేయడంలో మోదీ సర్కార్ ద్రోహం చేసిందని రైతు నేత రాకేశ్ టికాయిత్ మండిపడ్డారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించకుంటే ‘దేశవ్యాప్త అగ్రికల్చర్ హర్తాల్(వ్యవసాయ బంద్) చేపడుతామని హెచ్చరించారు. బీహార్ పర్యటనలో ఉన్న టికాయిత్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఎంఎస్పీ గ్యారంటీ డిమాండ్ను కేంద్రం పెడచెవిన పెట్టడం దారుణమని అన్నారు. పంట పండించడంలో, ఉత్పత్తిని అమ్ముకోవడంలో రైతులకు మరో మార్గం లేదని కేంద్రం భావిస్తున్నదని అన్నారు. అవసరమైతే వ్యవసాయాన్ని బంద్ చేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తద్వారా దేశంలో సంక్షోభం ఏర్పడుతుందని, అనంతరం కేంద్ర ప్రభుత్వాన్ని మోకాళ్లపై నిలబెడుతామని హెచ్చరించారు. బీహార్లో మండీ వ్యవస్థను పునరుద్ధరించాలని సీఎం నితీశ్ను కోరారు.