ముంబై: మహారాష్ట్రలో రాజకీయాల్లో ఆ ముగ్గురు నేతలు ఒక వెలుగు వెలిగారు. శివసేన నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ (MVA) ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. ఆ ముగ్గురు అగ్రనేతలు ఇప్పుడు ఒకే జైలులో ఉన్నారు. వారే శివసేన ఎంపీ సంజయ్ రౌత్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)కి చెందిన అనిల్ దేశ్ముఖ్, నవాబ్ మాలిక్. రెండు పార్టీలకు చెందిన ఈ ముగ్గురు ముఖ్యనేతలు మనీలాండరింగ్ కేసుల్లో ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో వేర్వేరు బ్యారకుల్లో కాలం వెళ్లదీస్తున్నారు. ఎంతైనా రాజకీయ నాయకులు కావడంతో జైలు అధికారులు వారికి టీవీ, పుస్తకాలు, క్యారంబోర్డు, అవసరమైన వన్నింటిని సమకూరుస్తున్నారు.
ముందుగా శివసేన మౌత్పీస్ సామ్నా పత్రిక ఎడిటర్, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ జైలులు ఏంచేస్తున్నారో చూద్దాం.. పత్రాచౌల్ భూ కుంబకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ నెల 1న సంజయ్ రౌత్ను అరెస్టు చేసింది. ఆగస్టు 22 వరకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో అధికారులు ఆయనను ఆర్థర్రోడ్ జైలుకు తరలించారు. అధికారులు ఆయనకు రాసుకోవడానికి ఓ నోట్బుక్కులు, పెన్నులు అందించారు. అదేవిధంగా చదుకోవడానికి జైలు లైబ్రెరీ నుంచి కొన్ని పుస్తకాలు తీసుకెళ్లారు. ఏదైనా పుస్తకం రాసుకోవాలనుకుంటే జైలు లోపల ఎక్కడికైనా కూర్చుని రాసుకోవచ్చని ఆయనకు సూచించారు. కోర్టు అనుమతించడంతో ఆయన రోజూ ఇంటి నుంచి ఆహారాన్ని తీసుకొస్తున్నారు.
ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్.. దావూద్ ఇబ్రహీం అనుచరులతో సంబంధాలు ఉన్నాయనే కేసులో ఆడీ ఆయనను ఫిబ్రవరి 23న అరెస్టు చేసింది. దీంతో ఆయనను అధికారులు ఆర్థర్ రోడ్డు జైలుకు తరలించారు. అయితే ఆరోగ్య కారణాలతో నవాబ్ మాలిక్ ప్రస్తుతం కుర్లాలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఆయనకు కూడా జైలు అధికారులు చదువుకోవడానికి పుస్తకాలు, ఆయన బ్యారక్లో టీవీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఓ క్యారంబోర్డు కూడా అందించారు. రోజు ఇంటి నుంచి వస్తున్న ఆహారాన్నే ఆయనకు ఇస్తున్నారు.
ఇక మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్.. గత తొమ్మిది నెలలుగా ఇదే జైలులో ఉంటున్నారు. మనీలాండరింగ్ కేసులో గతేడాది నవంబర్ 1న ఈడీ ఆయనను అరెస్టు చేసింది. ఆ ఇద్దరి లాగే అనిల్కు కూడా అధికారులు జైలులో అన్ని సదుపాయాలు కల్పించారు. కాగా, తోటి ఖైదీల్లాగే ఈ ముగ్గురు వీఐపీలకు కూడా నెలకు రూ.6 వేలు అందిస్తున్నారు. వాటికి వారికి అవసరమైన వస్తువులను జైలులో కొనుగోలు చేయవచ్చని అధికారులు తెలిపారు.