తిరుమల : తిరుమలలో వైభవంగా ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మూడంచెల భద్రతా విధానాన్ని అవలంభిస్తున్నామని టీటీడీ సీవీఎస్వో నరసింహకిషోర్ తెలిపారు. అసాంఘిక శక్తుల నుంచి భక్తులకు పటిష్టమైన భద్రత కల్పిస్తున్నామని, ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే అనుమతిస్తామని తెలిపారు.
మొదటి దశలో అలిపిరి చెక్ పాయింట్ వద్ద, రెండో దశలో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించే ముందు, మూడో దశలో మాడ వీధుల్లోకి అనుమతించే ముందు తనిఖీలు చేపడతామన్నారు. తిరుమలలో 2200 సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నామని, మూడో దశలో 1500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దశలవారీగా ఘాట్ రోడ్లను కూడా సీసీ కెమెరాల ద్వారా కవర్ చేస్తామన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో దొంగ తనాలు జరగకుండా చూసేందుకు, శాంతిభద్రతలను అదుపు చేసేందుకు టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో పాటు ప్రత్యేక స్క్వాడ్లు, 460 మంది ఎస్పిఎఫ్ సిబ్బంది కలిపి 5000 మంది బలగాలను మోహరిస్తున్నట్లు చెప్పారు.
మాడ వీధుల్లోని గ్యాలరీల్లో 1.25 లక్షల మంది కూర్చునే అవకాశం ఉందని, వాహనసేవ మొదలుకాగానే ఒక్కో గేటు నుంచి 10 వేల మందికి అదనంగా దర్శనం చేయించడం వల్ల మొత్తం 2.25 లక్షల మందికి దర్శనం చేయించవచ్చని తెలిపారు. తిరుమలలో చేయాల్సినవి, చేయకూడని అంశాల్లో భక్తులకు విస్తృతంగా ప్రచా రం చేస్తున్నట్టు చెప్పారు. మీడియా, పోలీసులు, టీటీడీ ఉద్యోగుల కోసం బేడి ఆంజనేయ దేవాలయం వద్ద ES-7 గేటు ద్వారా ప్రవేశం కల్పిస్తామని, ES-6 గేటు ద్వారా వెలుపలికి రావడానికి ఏర్పాట్లు చేశామన్నారు.
బ్రహ్మోత్సవం సందర్భంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, 2 ద్వారా సర్వదర్శనం క్యూలైన్లలోకి భక్తులు ప్రవేశించేందుకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించేందుకు వీలుగా గరుడసేవ రోజున హారతిని టీటీడీ బోర్డు రద్దు చేసిందని, మిగతా రోజుల్లో హారతులు కొనసాగుతాయని చెప్పారు. చక్రస్నానం సందర్భంగా 24 మంది ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేశామన్నారు.