కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో తాజా పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారత రాయబార కార్యాలయ ( Indian embassy ) సిబ్బందిని, సెక్యూరిటీ సిబ్బందిని భారత్ వెనక్కి రప్పించింది. ఇప్పటికే పలువురు అధికారులు, సెక్యూరిటీ పర్సనల్స్ను వెనక్కి తీసుకొచ్చిన భారత ప్రభుత్వం తాజాగా మరో 99 మంది ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ) కమెండోలు, మూడు స్నిఫర్ డాగ్స్ను రప్పించింది. దాంతో ఆఫ్ఘనిస్థాన్లోని నాలుగు రాయబార కార్యాలయాల్లో ఉన్న మొత్తం సిబ్బందిని వెనక్కి రప్పించినట్లయ్యింది.
భారత ప్రభుత్వం పంపిన మిలిటరీ విమానంలో 150 మంది ఐటీబీపీ సిబ్బంది, మాయ, రూబీ, బాబీ అనే మూడు స్నిఫర్ (వాసన పసిగట్టే) డాగ్స్ భారత్కు వచ్చాయి. వారిలో 99 మంది ఐటీబీపీ కమెండోలు, మూడు స్నిఫర్ డాగ్స్ మంగళవారం సాయంత్రం ఘజియాబాద్లోని హిందన్ ఎయిర్బేస్కు చేరుకున్నాయి. అయితే, ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన ఇండియన్ ఎంబసీ సిబ్బంది అందరిని వారం రోజులపాటు ఢిల్లీలోని ఐటీబీపీ సెంటర్లో క్వారెంటైన్కు తరలించారు.