హైదరాబాద్ : వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా ఉన్నది. పూడూర్ మండలం మన్నెగూడ వద్ద ధరణి కాటన్ మిల్ సమీపంలో క్వాలీస్ వాహనం ఎక్సల్ రాడ్ విరిగిపోవడంతో ఎదురుగా వస్తున్న కారుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన మల్లికార్జున్రెడ్డి, రాజ్యలక్ష్మి, దేవాన్షురెడ్డి సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.