మెదక్ అర్బన్, అక్టోబర్ 03 : టూరింగ్, విజిటింగ్ వీసాలపై మన దేశానికి వచ్చి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు ఇరాన్ దేశస్థులు కటకటాలపాలయ్యారు. సోమవారం మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని మీడియాతో వివరాలు వెల్లడించారు. ఇరాన్కు చెందిన కరీం, ఇవాజి నడేర్, బినియాజ్ బహమాన్ హైదరాబాద్ కోకాపేటలోని ఓ హోటల్లో గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు.
గత నెల 11న రామాయంపేటలోని చికెన్ సెంటర్ వద్దకు వెళ్లి తమ వద్ద విదేశీ కరెన్సీ ఉన్నదని, మీ వద్ద ఎన్ని డబ్బులున్నాయని మాయ మాటలు చెప్పి రూ.95వేలు, ఇదే తరహాలో ఈనెల 1న చేగుంటలో గ్యాస్ ఏజెన్సీలో రూ.17 వేలు దొంగతనం చేశారు. దాంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కారు నంబర్ (డీఎల్ 06సీజే 7714) ఆధారంగా వారిని పట్టుకొన్నారు. పోలీసులు నిందితుల నుంచి 850 డాలర్స్, రూ.30,50,000 ఇరాన్ కరెన్సీ, మూడు సెల్ఫోన్లు, పాస్పోర్టులను, డ్రైవింగ్ లైసెన్స్లను సీజ్ చేశారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేశారు.