న్యాయవాదులను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించే విషయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు గౌరవం దక్కింది. తాజాగా, సుప్రీం కోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన ఆరుగురిలో ముగ్గురూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. అందులో కరీంనగర్లోని మంకమ్మతోటకు చెందిన ఏనుగుల వెంకట వేణుగోపాల్, జగిత్యాలకు చెందిన పుల్ల కార్తీక్, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన జగ్గన్నగారి శ్రీనివాస్రావు కాగా, వీరిని సిఫారసు చేయడంపై ఉమ్మడి జిల్లాలోని న్యాయవాదుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సోమవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకోగా, సుప్రీంకోర్టు కూడా తాజాగా సమ్మతించింది. వీరి పేర్లను కేంద్రం ఆమోదించి రాష్ట్రపతికి నివేదిస్తుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర తర్వాత కేంద్ర న్యాయ శాఖ గెజిట్ ప్రచురిస్తుంది. అనంతరం కొత్త వారితో న్యాయమూర్తులుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయిస్తారు.
సిరిసిల్ల నుంచి జగ్గన్నగారి శ్రీనివాస్రావు
సిరిసిల్ల/గంభీరావుపేట, జూలై 26 : జగ్గన్నగారి శ్రీనివాస్రావు స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట. సామాన్య వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన 1969 ఆగస్టు 31న జన్మించారు. జగ్గన్నగారి లక్ష్మీబాయి-మాణిక్యరావు దంపతుల ముగ్గురు సంతానంలో మొదటివారు శ్రీనివాసరావు. స్వగ్రామంలో పదో తరగతి వరకు చదివి గంభీరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. అంతే కాకుండా, ఇంటర్ చదువుతూనే తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయం చేసేవారు. ఆ తర్వాత హైదరాబాద్ నారాయణగూడలోని భవన్స్ న్యూ సైన్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1999, ఏప్రిల్ 29న న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకున్నారు. ప్రముఖ న్యాయవాది జీ కృష్ణమూర్తి వద్ద జూనియర్గా పనిచేశారు. రిట్ సర్వీస్, నాన్ సర్వీస్ మ్యాటర్స్, సివిల్, క్రిమినల్ మ్యాటర్స్కు సంబంధించి లోయర్ కోర్టులు, హైకోర్టులు, ట్రిబ్యునళ్లలో వాదనలు వినిపించారు. 2006 నుంచి హైకోర్టులో స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2015 నుంచి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేస్తున్నారు. కాగా, ప్రస్తుతం సుప్రీం కోర్టు కొలీజియం హైకోర్టు న్యాయమూర్తిగా సిఫార్సు చేయడంతో అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఇదే మండలంలోని ముస్తఫానగర్కు చెందిన ఐలేని సుశీల-నర్సింగరావు కూతురు శ్రీలతను వివాహం చేసుకున్నారు. శ్రీనివాస్రావుకు కొడుకు ప్రణీత్, కూతురు ప్రక్షిప్త ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా శ్రీనివాస్రావును సిఫార్సు చేసిన సమాచారంతో లింగన్నపేట గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు లింగన్నగారి దయాకర్రావు, ఎంపీటీసీ బెందె రేణుక, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
జగిత్యాల జిల్లా నుంచి పుల్ల కార్తీక్
జగిత్యాల విద్యానగర్, జూలై 26 : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల నియామక జాబితాలో జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన పుల్ల కార్తీక్ను సుప్రీంకోర్టు కొలీజియం హైకోర్టు న్యాయమూర్తిగా సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. జిల్లా కేంద్రంలోని విద్యానగర్ ప్రాంతానికి చెందిన పుల్ల ఒగ్గు హన్మంతు-పోచమల్లమ్మ దంపతులకు 1967, జూన్ 4న జన్మించిన ఆయన, తన విద్యాభ్యాసాన్ని మొత్తం ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పూర్తి చేశారు. ప్రాథమిక విద్యను జగిత్యాలలోని కొత్తవాడ ప్రభుత్వ పాఠశాలలో అభ్యసించారు. హైస్కూల్ విద్యాభ్యాసాన్ని నూతన ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యను ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఓయూలో డిగ్రీ, ఎంఏ పొలిటికల్ సైన్స్ను ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో పూర్తి చేశారు. ఎల్ఎల్బీ ఓయూలోని పీజీ కాలేజీ ఆఫ్ లా లో పూర్తి చేశారు. ఎల్ఎల్ఎంను సైతం ఓయూలోని పీజీ కాలేజ్ ఆఫ్ లా లో చదివారు. 1996, మార్చి 27న బార్ కౌన్సిల్లో నమోదై, హైదరాబాద్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 2015, ఏప్రిల్ 1 నుంచి 2017, జూన్ 2 వరకు ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్లో ప్రభుత్వ ప్లీడర్గా పనిచేశారు. మళ్లీ 2017, నవంబర్ 7న హైకోర్టు గవర్నమెంట్ ప్లీడర్గా నియమితులై కొనసాగుతున్నారు.
కరీంనగర్ నుంచి ఏనుగుల వెంకట వేణుగోపాల్
కోర్టు చౌరస్తా, జూలై 26 : కరీంనగర్ మంకమ్మతోటకు చెందిన ఈవీ రాజేశ్వర్రావు-బాలకుమారి దంపతులకు 1967, ఆగస్టు 16న జన్మించిన ఈ వెంకట వేణుగోపాల్ హైకోర్టు న్యాయమూర్తిగా సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురిలో ఒకరు. కరీంనగర్ సైన్స్వింగ్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి, ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ఉస్మానియాలో లా చదివి 1992లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేయించుకున్నారు. మూడేళ్ల పాటు జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేశారు. 1995లో ఢిల్లీ వెళ్లి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలాని వద్ద జూనియర్గా చేరారు. 2012లో రాష్ట్ర హైకోర్టులో వృత్తి ప్రారంభించి 2021లో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు.