కీసర, సెప్టెంబర్ 28: పుట్టిన రోజును సంతోషంగా స్నేహితులతో జరుపుకొంటూ.. అంతలోనే పుట్టిన ఈత సరదా ముగ్గురు విద్యార్థుల ప్రాణం తీసింది. ఈ ఘటన విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులను శోఖ సంద్రంలో ముంచింది. కండ్ల ముందే స్నేహితులు నీటిలో మునిగి కానరాని లోకాలకు వెళ్తుంటే.. ఒడ్డున ఉన్న స్నేహితులు ఏమీ చేయలేని స్థితిలో గుండెలవిసేలా రోదించారు. దీంతో కీసర మండలంలోని నాట్కాన్ చెరువు, పరిసరాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కీసర పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు తీగల కృష్ణారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో డిప్లొమా థర్డ్ ఇయర్ చదువుతున్నారు. బుధవారం హయత్నగర్కు చెందిన హరిహరన్ (18), చంపాపేట్కు చెందిన హుబెద్ (18) పుట్టినరోజు సందర్భంగా రామోజీ ఫిలింసిటీకి చెందిన బాలాజీ(18)తో పాటు మరో ఆరుగురు విద్యార్థులు కీసర మండలం, చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి వచ్చారు. స్వామివారిని దర్శించుకున్నారు.
తిరిగి ఇంటికెళ్తున్న సమయంలో పక్కనే ఉన్న నాట్కాన్ చెరువు కనిపించింది. తొమ్మిది మంది విద్యార్థులు సరదాగా స్నానం చేద్దామన్న ఆలోచనతో చెరువులోకి దిగారు. హరిహరన్, హుబెద్, బాలాజీ చెరువు నీటిలోకి లోతుగా వెళ్లి నీట మునిగి ఒక్కసారిగా గల్లంతయ్యారు. ముగ్గురికి ఈత రాకపోవడంతో గిలగిలా కొట్టుకుంటూ నీట మునిగి మృతి చెందారు. అక్కడున్న తోటి విద్యార్థులు స్థానికుల సహాయంతో కీసర పోలీసులకు సమాచారమిచ్చారు. కీసర సీఐ రఘువీరారెడ్డి తన పోలీసు బలగాలతో నాట్కాన్ చెరువు వద్దకు చేరుకొని.. విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. గజ ఈతగాళ్ల సహాయంతో బాలాజీ మృతదేహాన్ని మాత్రమే బయటకు తీశారు. ఇంకా రెండు మృతదేహాల కోసం పోలీసులు, గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు విద్యార్థుల కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని బోరుమని విలపించారు. చేతికొచ్చిన కొడుకులు చనిపోవడంతో మాకు దిక్కెవరంటూ రోదిస్తుంటే.. పలువురి హృదయాలు ఒక్కసారిగా కదిలించివేశాయి.
హయత్నగర్లో విషాదం
మన్సూరాబాద్, సెప్టెంబర్ 28: పుట్టిన రోజున దైవదర్శనానికి వెళ్లిన కుమారుడి మరణ వార్త విన్న ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గుడికి వెళ్తున్నానంటూ చెప్పి సంతోషంగా వెళ్లిన కొడుకు తిరిగిరాని లోకానికి వెళ్లాడని తెలుసుకున్న తల్లి, చెల్లి గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఉద్యోగ నిమిత్తం చెన్నై వెళ్లిన తండ్రి కుమారుడి మరణ వార్త విని హుటాహుటిన నగరానికి బయలుదేరాడు. కీసర పోలీస్స్టేషన్ పరిధి చీర్యాల్ నాట్కాన్ చెరువులో మునిగి చనిపోయిన హరిహరన్ మృతితో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లాకు చెందిన తరిగోపుల రామకృష్ణయ్య తన భార్య లక్ష్మి, కుమారుడు హరిహరన్ (18), కూతురు పూజితతో కలిసి హయత్నగర్లోని వినాయక్నగర్కాలనీ రోడ్డునం. 4లో తొమ్మిదేండ్లుగా ఉంటున్నాడు. రామకృష్ణయ్య రామోజీ ఫిలిం సిటీ షూటింగ్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రిషియన్గా పని చేస్తున్నాడు. కుమారుడు హరిహరన్ మీర్పేటలోని తీగల కృష్ణారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో డిప్లొమా ఫైనల్ ఇయర్ (ఈసీఈ) చదువుతున్నాడు. కూతురు పూజిత ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతుంది. బుధవారం హరిహరన్ పుట్టినరోజు కావడంతో తన స్నేహితులతో కలిసి గుడికి వెళ్తున్నానని తల్లికి చెప్పి ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. మధ్యాహ్నం హరిహరన్ కీసర్ పోలీస్స్టేషన్ పరిధి చీర్యాల్ నాట్కాన్ చెరువులో మునిగి మృతి చెందినట్లు తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం అందింది. ప్రస్తుతం తండ్రి రామకృష్ణయ్య చెన్నైలో ఉన్నాడు. షూటింగ్ నిమిత్తం చెన్నై వెళ్లిన రామకృష్ణయ్య.. కుమారుడి మరణ వార్త విని హుటాహుటిన నగరానికి బయలుదేరాడు.
చెరువులోకి వెళ్లొద్దంటున్నా..
చెరువు లోపలికి వెళ్లకండి.. అంటూ గట్టుమీదున్న తోటి విద్యార్థులు ఎంత మొత్తుకున్నా చెరువులో సరదాగా స్నానం చేస్తూ చాలా దూరం వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. కళ్లముందే తోటి స్నేహితులు మృత్యు ఒడిలోకి జారిపోతుంటే.. గట్టుమీద ఉన్న ఆరుగురు స్నేహితులు ఒక్కసారిగా కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.