నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్లో (Nashik) వరుస భూకంపాలతో ప్రజలకు భయాందోళనలకు గురయ్యారు. గంట వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించడంతో వణికిపోయారు. మంగళవారం రాత్రి 8.58 గంటలకు 3.4 తీవ్రతతో మొదటిసారి భూకంపం వచ్చింది. అతనంతరం రాత్రి 9.34 గంటలకు మరోసారి, 9.42 గంటలకు మళ్లీ భూమి కంపించింది. ఈ రెండుసార్లు రిక్టర్ స్కేలుపై 2.1, 1.9 తీవ్రత నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
భూకంపం కేంద్రం నాసిక్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిండోరి తాలూకాలో ఉన్నదని అధికారులు వెల్లడించారు. తాలూకాలోని చాలా గ్రామాల్లో భూమి కంపించిందన్నారు. భూకంప తీవ్రత జంబుట్కే గ్రామంలో అధికంగా ఉందని చెప్పారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదన్నారు. కాగా, గత నెలలో భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. నాసిక్లో ఆలయాలు మునిగిపోయాయి.