రథాన్ని భద్రపరుస్తుండగా షాక్
నల్లగొండ జిల్లా కేతేపల్లిలో ఘటన
నాంపల్లి మే 28 : రథాన్ని రథశాలలో భద్రపరుస్తున్న క్రమంలో విద్యుత్తు తీగలు తాకడంతో కరెంట్ షాక్ తగిలి ముగ్గురు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమం గా ఉన్నది. ఈ ఘటన నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లిలో చోటుచేసుకొన్నది. కేతేపల్లిలో ఈ సారి శ్రీరామనవమి సందర్భంగా రథోత్సవాన్ని నిర్వహించి రథాన్ని రథశాలకు, దేవాలయానికి మధ్యలో ఉంచారు. శనివారం గ్రామానికి చెందిన పీ దయానందరెడ్డి కొంతమందిని తీసుకెళ్లి రథాన్ని రథశాలలో పెట్టిస్తున్నారు.
ఈ క్రమంలో 11 కేవీ విద్యుత్తు తీగలు రథానికి తగలడంతో షాక్ తగిలి గ్రామానికి చెందిన రాజబోయిన యాదయ్య (35), పొగాకు మోహనయ్య (40), గుర్రంపోడు మండలం మక్కపల్లికి చెందిన దాసరి ఆంజనేయులు (30) మరణించారు. తీవ్రంగా గాయపడిన రాజబోయిన వెంకటయ్యను నల్లగొండలోని దవాఖానలో చేర్పించగా.. పరిస్థితి విషమంగా ఉన్నది.
విద్యుదాఘాతంతో మృతి చెందిన వారి కుటుంబాలను దేవరకొండ ఏరియా దవాఖానలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.