డ్రగ్స్, ఆయుధాల కేసుల్లో అరెస్టయి జైల్లో ఉన్న ఇద్దరు ఖైదీలు.. దొంగతనం కేసులో జైలుకొచ్చిన మరో ఖైదీతో కలిసి పరారయ్యారు. ఇది జరిగింది కూడా అగ్రరాజ్యం అమెరికాలో కావడం గమనార్హం. మిసోరీలోని జైల్లో బ్లెవిన్స్, స్టీఫెన్స్, క్రాఫోర్డ్ అనే ముగ్గురు ఖైదీలు ఉన్నారు. వీళ్లు ముగ్గురూ కూడా తమ సెల్ సీలింగ్కు పెద్ద కన్నాలు చేసి అక్కడి నుంచి పారిపోయారు.
ఆ రంధ్రాల నుంచి ఒక మెయింటెనెన్స్ డోర్కు చేరుకున్న ముగ్గురూ.. అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వాళ్లకు జైలు అధికారుల్లో ఎవరైనా సహాయం చేసినట్లు ఎలాంటి ఆధారాలూ లేవని పోలీసులు అంటున్నారు. అసలు ముగ్గురు ఖైదీలు తప్పించుకొని ఎంత సమయం గడిచిందో కూడా ఎవరికీ తెలియదని సమాచారం.
ఈ ఖైదీల వద్ద ఆయుధాలు ఉన్నాయని, కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. త్వరలోనే ముగ్గుర్నీ అదుపులోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.