హైదరాబాద్ : పండ్ల దుకాణంలో పనిచేసే వ్యక్తి హత్య కేసులో నగరంలోని రాచకొండ పోలీసులు ఆదివారం ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్టు అయిన నిందితులు పి. సందీప్ రెడ్డి(28), పి. ఉదయ్ కిరణ్ రెడ్డి, ఏ. శ్రీకాంత్ రెడ్డి. హయత్నగర్ చోటుచేసుకున్న ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సందీప్ రెడ్డి పండ్ల దుకాణం యజమాని సుభాష్ వద్ద రూ. 720 అప్పు చేశాడు. డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా అడగడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ క్రమంలో సుభాష్.. సందీప్ బైక్ తాళాలు, మొబైల్ ఫోన్ లాక్కొని డబ్బులు ఇచ్చి వాటిని తీసుకువెళ్లాల్సిందిగా తెలిపాడు. దీంతో కోపోద్రిక్తుడైన సందీప్ తన స్నేహితులిరువురిని పిలిచి దుకాణ యజమాని సుభాష్ అందులో పనిచేసే మధుసూధన్రెడ్డి(45)పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ మధుసూధన్రెడ్డి చనిపోయాడు. దీంతో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.