జైపూర్: ఒక మంత్రిని హనీ ట్రాప్ చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్లోని జోధ్పూర్లో ఈ ఘటన జరిగింది. మంత్రి రాంలాల్ జాట్ను హనీ ట్రాప్ చేయడానికి ముగ్గురు ప్రయత్నించారు. దీని కోసం ఒక మోడల్ను బ్లాక్ మెయిల్ చేశారు. అయితే రెండు రోజుల కిందట ఆ మహిళ హోటల్ పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.
కాగా, 2021 అక్టోబర్లో ఆ మహిళ మోడలింగ్ కోసం ఉదయ్పూర్ వెళ్లగా నిందితులు అక్షిత్, దీపాలీతో ఆమెకు పరిచయం ఏర్పడిందని జోధ్పూర్ ఈస్ట్ డిప్యూటీ సీపీ భువన్ భూషణ్ యాదవ్ తెలిపారు. అనంతరం దీపాలీ ఆ మోడల్ను సంప్రదించి అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోల సాకుతో మంత్రికి ఫైల్ను తీసుకెళ్లమని బ్లాక్ మెయిల్ చేశారని చెప్పారు. నిందితుడు అక్షిత్ హనీ ట్రాప్ ముఠాను నడుపుతున్నాడని ఆయన తెలిపారు. ఈసారి ఒక మంత్రిని హనీ ట్రాప్ ద్వారా బ్లాక్మెయిల్ చేయాలని అతడు ప్లాన్ చేశాడని అన్నారు.
మరోవైపు రాజస్థాన్ మంత్రి రాంలాల్ జాట్ను హనీ ట్రాప్ చేసేందుకు ప్రయత్నించడంపై మరో మంత్రి ప్రతాప్ ఖచరియావాస్ స్పందించారు. హనీ ట్రాప్ కేసులు, కుట్రలు రాజవంశాలున్నప్పటి నుంచి ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతున్నాయని తెలిపారు. పూర్వం రాజులను హనీ ట్రాప్ చేసి చంపేవారని చెప్పారు. కాబట్టి రాజకీయాల్లో కూడా ఇలాంటి కుట్రలు జరుగుతాయని ఆయన అన్నారు. దీనికి మంత్రి గారు ఏం చేయగలరు? ఆయనకేమీ తెలియదంటూ వ్యాఖ్యానించారు.