BRS KCR | ‘రాష్ట్రం ఏర్పడిన ఆరో నెల.. 2014 నవంబర్ 20 నాటి నుంచే ప్రజలకు కోతల్లేని విద్యుత్తును అందిస్తున్నాం. విద్యుత్ రంగాన్ని తీర్చిదిద్ది నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నం. రాష్ట్రంలో ప్రస్తుతం జనరేటర్ల అవసరం చాలా వరకు తగ్గిపోయింది. రాష్ట్రంలో ఇన్వర్టర్లు పోయి, ఇన్వెస్టర్లు వచ్చే కాలం వచ్చింది. – కేసీఆర్
తెలంగాణ ఏర్పాటుతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తిగా నిలిచిన కల్వకుంట్ల చంద్రశేఖర్రావు.. దసరా పండుగ రోజు భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీ ఏర్పాటును ప్రకటించి దేశ రాజకీయాల్లో నవశకానికి నాంది పలికారు. ఎందరో మహామహుల్ని ఎదిరించి, ఎన్నో త్యాగాలకు ఎదురొడ్డి నిలిచి ఎన్నో ఎండ్ల కలను సాకారం చేసిన నాయకుడిగా కేసీఆర్ నిలిచారు. భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటుతో దేశ రాజకీయాల్లో సంచనలం నమోదు చేయనున్న కేసీఆర్.. ఆలోచనలు, ఆచరణ అంతా భారీగానే ఉంటాయి. బీజేపీకి ప్రత్యామ్నాయంగా జాతీయ పార్టీని ప్రకటించిన కేసీఆర్.. దేశ్ కీ నేతాగా అవతరించడంతో తమ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని పలు రాష్ట్రాల ప్రజలు వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. కాళేశ్వరం వంటి ఎత్తిపోతలు తమ రాష్ట్రంలో కూడా సాక్షాత్కరిస్తుందని.. రైతు బంధు, దళిత బంధు, కల్యాణమస్తు, రైతు బీమా, ఆసరా పింఛన్లు వంటి ప్రజా సంక్షేమ పథకాలు తమను కూడా వరిస్తాయని వివిధ రాష్ట్రాల ప్రజలు ఆశతో ఉన్నారు.
అదేమన్నా అయ్యేదా పొయ్యేదా? ఎందుకయ్యా బంగారమసుంటి భవిష్యత్తు ఖరాబు చేసుకుంటావు. ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని కష్టాల పాలు చేసుకోవడం ఎందుకు చెప్పు. వదిలెయ్.. ఇదీ కేసీఆర్ తెలంగాణ నినాదాన్ని ఎత్తుకునే ముందు అనేక మంది ఇచ్చిన సలహా. కానీ కేసీఆర్ వినలేదు. ఆయన అంతే.
“వాస్తవానికి ప్రతి పనీ రెండు సార్లు జరుగుతుంది. మొదటిసారి మన ఆలోచనలో, రెండోసారి మన ఆచరణలో!” ఇదీ కేసీఆర్ సిద్ధాంతం. నీ ఆలోచన ఎంత గరిమతో, ఎంత లోతుగా ఉంటుందన్నదాన్ని బట్టే ఆచరణలో దాని సాఫల్యత ఆధారపడి ఉంటుందని ఆయన భావిస్తారు. తెలంగాణ రాష్ట్ర సాధన, ఇంటింటికీ మంచి నీళ్లు, 24 గంటల నిరంతర కరెంటు, మూడేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు, పూర్తి కృష్ణశిలతో యాదాద్రి నిర్మాణం, కోట్లాది మొక్కల పెంపకం, రైతులందరికీ పెట్టుబడి సాయం, రైతు బీమా, దళితులందరికీ పది లక్షల రూపాయలు… ఇలా కేసీఆర్ చేపట్టిన ఏ పథకం చూసినా తలచుకుంటే భయమయ్యేంత పెద్దది! ఎంత పెద్దదీ అంటే గత ప్రభుత్వాలతో పోలిస్తే, అవి తమ పూర్తి పదవీకాలంలో, ఇందులో ఒక్కదాన్ని కూడా చేయలేకపోయేవి. కానీ ఏడేండ్లలో, ఏక కాలంలో, ఉన్న పరిమిత అధికార యంత్రాంగంతోనే అన్నీ పూర్తి చేయగలిగారు. కార్యక్రమం ఎంత పెద్దదన్నది కాదు; నీ ప్లానింగ్ ఎంత పకడ్బందీగా ఉందన్నదే కీలకం అంటారాయన. ఆయుధం కన్నా ఆశయం గొప్పది.