జయశంకర్ భూపాలపల్లి : సీఎం కేసీఆర్ పాలన ప్రణాళిక బద్ధంగా సాగుతుంది. ప్రజలకు మేలు చేయలేని చాలా మంది విమర్శలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
ఆదివారం గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి మహిళలకు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలు గత ప్రభుత్వ హాయాంలో ఎలాంటి పాలన అందించాయి.
ప్రస్తుతం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎలాంటి పాలన అందిస్తున్నారు అనే విషయాన్ని ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో పెన్షన్లుగాని, సంక్షేమ పథకాలు గాని సక్రమంగా అమలు కావడం లేదని, అరకొర పెన్షన్లు అందిస్తూ చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. అనంతరం ఆసరా పెన్షన్ కార్డులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.