సిద్దిపేట : సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లోని నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునే ఆదాయ, నివాసం, కుల ధృవీకరణ పత్రాలను 24 గంటల్లోనే ఇవ్వాలనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో ఉన్న నిరుద్యోగులు ఆదాయ, కుల , నివాస ధృవ పత్రాలు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే ఆలస్యం అవడంతో పై చదువులకు, ఉద్యోగాల దరఖాస్తులకు ఇబ్బందులు కలుగుతుందని నా దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి ఇబ్బందులు కలగకుండా దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే సంబంధిత పత్రాలు చేతికి అందాలని అధికారులను ఆదేశించారు.
వారి సమయం వృథా కాకుండా ఏ రోజుకు ఆ రోజు పత్రాలు వచ్చే విధంగా చూడాలన్నారు. మీ సేవ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా మీ సేవ కేంద్రాలను అందుబాటులో తేవాలని సూచించారు. ఉద్యోగం కోసం అప్లై చేసే వారికి అన్నివిధాలా బాసటగా నిలవాలని చెప్పారు. ఇందుకు ఆర్డీవోలు, తహసీల్దార్లు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు కలగకుండా చూడాలి..
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి. మిల్లర్స్ తో సమన్వయం చేస్తూ రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి అన్నారు. గన్నీ బ్యాగ్స్ డ్యామెజ్ లేకుండా ఇవ్వాలని తూకపు యంత్రాలు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
అకాల వర్షాలు కురిస్తే ధాన్యం తడవకుండా టార్పలిన్ కవర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు అన్ని కొనుగోలు కేంద్రాలు సందర్శించి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ధరణి పోర్టల్లో కొత్తగా వచ్చిన సవరణలను కూడా రైతులకు అందుబాటులో ఉంచాలని మంత్రి సూచించారు.