న్యూఢిల్లీ : శారీరక, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం కీలకమని వైద్య నిపుణులు సూచించడంతో పాటు పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. నిత్యం వ్యాయామం చేస్తే ఆరోగ్యకరమైన జీవితంతో పాటు అధిక బరువు తగ్గడం నుంచి వ్యాధుల బారిన పడే ముప్పు తగ్గుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. అయితే స్ట్రెంత్ ట్రైనింగ్తో మెరుగైన ఆరోగ్యంతో పాటు దీర్ఘాయువు సొంతమవుతుందని తాజా పరిశోధన స్పష్టం చేసింది.
వెయిట్ లిఫ్టింగ్, పుషప్స్, పైలెట్స్ వంటి స్ట్రెంత్ ట్రైనింగ్తో ఈ ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని అధ్యయనం వెల్లడించింది. వారానికి ఒక రోజు ఈ తరహా వ్యాయామంతో దీర్ఘాయువు సాధ్యమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. వాకింగ్, లేదా స్విమ్మింగ్ వంటి సాధారణ కార్డియో వర్కవుట్ల కంటే స్ట్రెంత్ ట్రైనింగ్ వృద్ధులకు మేలు చేస్తుందని ఏరోబిక్స్తో పాటు వారానికి ఒకసారి వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేసిన వారిలో వచ్చే దశాబ్ధంలో మరణించే ముప్పు 47 శాతం తగ్గుతుందని వెల్లడైంది.
ఏరోబిక్ వర్కవుట్లు చేసే వారికి మరుసటి దశాబ్ధంలో మరణాల ముప్పు 34 శాతం తగ్గుతుందని అధ్యయనం పేర్కొంది. కేవలం వెయిట్ ట్రైనింగ్పైనే ఫోకస్ చేసే వారిలో మరణాల ముప్పు 22 శాతం తగ్గుతుందని వెల్లడైంది. బరువులు ఎత్తడం ద్వారా కండరాలు పటిష్టమై వయోభారం వల్ల తలెత్తే సమస్యలను నివారిస్తుందని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే భారీ బరువులను ఎత్తడమే కాదని, పుషప్స్, పైలెట్స్ వంటి వ్యాయామాలతోనూ ఫిట్నెస్ పొందవచ్చని పేర్కొంది.