పానీపూరి పేరు వినగానే నోట్లో లాలజలం ఊరుతుంది. ఇక ఏ వీధిలోనైనా సాయంత్రం కాగానే పానీపూరి బండి దర్శనమిస్తోంది. అలా సరదాగా సాయంత్రం సమయంలో పానీపూరి తింటే ఆ కిక్కే వేరేగా ఉంటుంది. అలాంటి పానీపూరిని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. కానీ కొవిడ్ కారణంగా పానీపూరికి చాలా మంది దూరంగా ఉంటున్నారు. కరోనా వ్యాప్తి చెందిన తర్వాత ప్రతి ఒక్కరూ పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో మనిషి సర్వ్ చేయకుండానే పానీపూరి తినేలా ఆటోమేటిక్ మెషిన్ను రూపొందించారు ఓ ఇద్దరు వ్యక్తులు.
సికింద్రాబాద్ పరిధిలోని కాప్రాలోని లక్ష్మీపురం కాలనీ, రుక్మిణి కాలనీలో లవ్ విత్ పానీపూరి ఈ ఆటోమేటిక్ మెషిన్ను ఏర్పాటు చేశారు. ఈ మెషిన్లో ముందుగానే వివిధ రుచులు గల ద్రావణాలతో పాటు చట్నీలను ఉంచుతారు. ఒక వ్యక్తి పానీపూరిని ఆ మెషిన్ వద్ద పెట్టగానే సెన్సార్ సిస్టం ద్వారా దాంట్లో ఆ ద్రావణం పడిపోతోంది. ఆ తర్వాత తినేయొచ్చు.
ఈ సందర్భంగా లవ్ విత్ పానీపూరి నిర్వాహకుడు కృష్ణ మాట్లాడుతూ.. పానీపూరిని మాత్రమే తాము కస్టమర్లకు చేతికి ఇస్తామన్నారు. ఆ తర్వాత పానీపూరిని ఆటోమెటిక్ మెషిన్ వద్ద ఉంచితే ద్రావణం పడిపోతోందన్నారు. తాము జింజర్ లెమన్, చట్పాట, కచ్చా మ్యాంగో, కట్టామీఠా, జల్జీరా, పుదీనా ద్రావణాలను అందుబాటులో ఉంచామన్నారు. దీంతో పాటు పిజ్జా పూరి, ఫైర్ పూరి, పాన్ షాట్స్ కూడా ఆరగించొచ్చు అని కృష్ణ పేర్కొన్నారు. తన స్నేహితుడు సురేశ్తో కలిసి ఈ షాపును ఏర్పాటు చేశామన్నారు.