ముంబై: చెడుపై మంచికి విజయంగా జరుపుకునే దసరా రోజున దేశ వ్యాప్తంగా రావణుడి దిష్టి బొమ్మలను దహనం చేస్తారు. అయితే మహారాష్ట్రలోని ఒక గ్రామం మాత్రం ఎంతో ప్రత్యేకం. దసరా రోజున రావణాసురుడి విగ్రహానికి హారతి ఇచ్చి పూజలు చేశారు. రావణుడి ఆశీర్వాదం వల్లనే తమ గ్రాస్తులు ఉపాధి పొందుతున్నారని, గ్రామంలో శాంతి, సంతోషాలు నెలకొంటున్నాయని వారు నమ్ముతున్నారు. అకోలా జిల్లాలోని సంగోలా గ్రామంలో ఈ వింత ఆచారం ఎన్నో వందల ఏళ్లుగా కొనసాగుతున్నది. ఆ గ్రామం మధ్యలో రాక్షస రాజైన రావణాసురుడి పది తలలతో కూడిన ఎత్తైన విగ్రహం ఉంది. సంగోలా గ్రామస్తులు దసరా రోజున ఈ విగ్రహానికి ప్రత్యేకంగా పూజలు చేయడంతోపాటు మహా హారతి ఇస్తారు. రావణుడి ఆశీర్వాదం కారణంగా గ్రామస్తులు ఉపాధి, ఉద్యోగాలు పొందుతున్నారని, గ్రామంలో శాంతి, సంతోషాలు వర్ధిల్లుతున్నాయని నమ్ముతున్నారు.
కాగా, సంగోలా గ్రామస్తులు శ్రీరాముడ్ని కూడా ఆరాధిస్తారు. అయితే రాక్షస రాజైన రావణాసురుడ్ని కూడా అంతగా నమ్ముతారు. ఎంతో తెలివి, తపస్వీ వంటి గుణాలున్న రావణుడి విగ్రహానికి దసరా రోజున భారీగా హారతి ఇస్తారు. దీనిని చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి జనం పెద్ద సంఖ్యలో ఈ గ్రామానికి వస్తారు. దసరా రోజున దేశ వ్యాప్తంగా రావణుడి దిష్టిబొమ్మలు దహనం చేస్తే ఈ గ్రామంలో మాత్రం రావణుడి విగ్రహానికి పూజలు చేయడంతోపాటు హారతి ఇస్తారని ఆ ఆలయ పూజారి, స్థానికులు వెల్లడించారు.